సమాజ సేవ చేయాలంటే కావాల్సింది డబ్బు కాదు, మనసు. మనసు లేకపోతే ఎంత డబ్బు ఉన్నా కించిత్తు సేవ చేయడం కూడా సాధ్యం కాదు. అదే సేవాభావాన్ని పుణికిపుచ్చుకుంటే ఏమీ అడ్డు రావు. దీనికి నిదర్శనమే ఈ సాధారణ ఆటో డ్రైవర్. కర్కశ పాషాణ హృదయులు రోడ్డున పడవేసిన ఎంతో మంది తల్లిదండ్రులను అక్కున చేర్చుకుంటున్నాడు. అందరూ ఉన్నా ఎవరూ లేకుండా కాలధర్మం చెందుతున్న వారికి తానే కొడుకై అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నాడు దమ్మాయిగూడకు చెందిన ఆటో డ్రైవర్ రాజు.
నాగర్కర్నూల్కు చెందిన రాజుది సాధారణ వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఊళ్లో రాజుకు బతుకుదెరువు లేకపోవడంతో పట్నం బాటపట్టారు. నగరానికి ఆనుకొని ఉన్న మేడ్చల్ జిల్లా ప్రాంతంలోని దమ్మాయిగూడకు వలస వచ్చాడు. ఆటోడ్రైవర్గా పని చేస్తూ తన భార్య, కూతురు, కొడుకును పోషిస్తున్నాడు. పెద్దగా స్థితిమంతుడేమి కాకున్నా నెలకు తాను సంపాదించే 15, 20వేలతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు.
కర్ణాటకకు చెందిన లతాబాయిని కన్నకొడుకు దమ్మాయిగూడ ప్రాంతంలోని నడిరోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. దాదాపు 75 ఏండ్ల వయసున్న ఆ తల్లికి ఎటువెళ్లాలో తెలియలేదు. దిక్కుతోచని స్థితిలో రోడ్డు పక్కన తిరుగుతున్న ఆ తల్లి వివరాలు తెలుసుకున్న రాజు చేరదీశాడు. అంతేకాదు ఆమెను వృద్ధాశ్రమంలో చేరిపించి బతికున్నన్ని రోజులు బాగోగులు చూసుకున్నాడు. ఆరోగ్యం బాగా లేక మృతి చెందిన లతాబాయి అంతిమ సంస్కారాలను, దశదిన కర్మ నిర్వహించారు. కరోనా సమయంలో నిలువ నీడ లేకుండా బాధపడుతున్న వారికి, ఉపాధి కరువై నాలుగు మెతుకులు కూడా తినలేని వారికి తనవంతు సహాయంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశాడు. అంతేగాదు తాను నివసించే, సంచరించే ప్రాంతాల్లో అన్నార్తులను ఆదుకుంటూ తనకు తోచిన సహాయం చేస్తున్నాడు. అతడి సేవా హృదయాన్ని తోటి ఆటో డ్రైవర్లు, స్థానికులు ప్రశంసిస్తున్నారు.