సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ) : ఆమె బేకరీకి యజమానురాలు. తన ఇంట్లో 15 మందికి కరోనా సోకింది. పలకరించే వారున్నా సమయానికి భోజనం దొరకక చాలా ఇబ్బందిపడ్డారు. ఎవరైనా ఆకలి తీరిస్తే బాగుండు అనిపించింది. ఎలాగోలా కరోనాను జయించి మామూలు స్థితికి వచ్చారు. తాము పడిన బాధలు ఇంకెవరూ పడకూడదని భావించారు. వైరస్ బారినపడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారితోపాటు వారి సహాయకుల కడుపు నింపుతున్నారు బోయన్పల్లికి చెందిన అనస్థీషియా పటిస్సేరి బేకరీ యజమాని గౌరి బాకరాజు. ‘కొవిడ్ మీల్స్ డ్రైవ్’ పేరిట ఏప్రిల్ 27న ప్రారంభించగా రోజుకు వందమందికిపైనే ఉచిత భోజనం అందిస్తూ ఇప్పటివరకు సుమారు 2800 మంది కడుపునింపారు. కొవిడ్ రోగితోపాటు వారి సహాయకులు, అన్నం కోసం అలమటించే వారి ఆకలి తీరుస్తున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరే వారు చాలావరకు పేదలు, దిగువ మధ్యతరగతి వారు. వారికి సమయానికి చక్కటి భోజనం దొరకడం కష్టమవుతున్నది. అందుకే సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి, నాచారం ఈఎస్ఐ అస్పత్రి వద్ద నిత్యం ఉచిత భోజనం అందిస్తున్నారు. బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో భోజనం కోసం ఒకరోజు విరాళం ఇచ్చారు. రోగులకే కాదు కరోనా కట్టడి కోసం శ్రమిస్తున్న పోలీసులకు ఉచితంగా అల్పాహారం పెడుతున్నారు. తన సొంత డబ్బుతోపాటు సుమారు 100 మంది దాతల నుంచి విరాళాలు సేకరించి ‘కొవిడ్ మీల్స్ డ్రైవ్’ను ప్రారంభించారు. దాదాపు 11 మంది బృందం ఈ ఉచిత భోజనం, అల్పాహారం కార్యంలో పాలుపంచుకుంటున్నారు.
ఇంట్లో బోలెడంత డబ్బు ఉన్నా సమయానికి భోజనం లేకపోతే సంపాదించింది వృథానే అంటారు గౌరి. తాము కరోనా సమయంలో పడిన ఇబ్బందులు చూసి చలించిపోయానని, అందుకే ఈ ఉచిత భోజనం అందిస్తూ ఆకలి తీరుస్తున్నట్లు వినయంగా వెల్లడించారు. ఈ సేవలు కరోనా సమయంలోనే కాకుండా..భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పారు. ఇప్పటివరకు విరాళాలు, సొంతంగా కలిపి సుమారు రూ.లక్ష వరకు ఖర్చయ్యిందని, అయినా వెనకాడేది లేదని, పేదల కడుపు నింపడమే తమ అభిమతం అంటున్నారు. దాతలు ముందుకొచ్చి సహకరిస్తే మరింత మందికి ఉచిత భోజనం పెడుతానని ప్రకటించారు ఆమె.
గౌరి బాకరాజు హోం మేడ్ బేకరీ యజమానురాలు (చెఫ్). ప్రస్తుతం బోయిన్పల్లిలోని తన ఇంట్లోనే అనస్థీషియా పటిస్సేరి పేరుతో హోం బేకరీ నడుపుతున్నారు. ఏడాదిన్నర కాలంగా ఇంట్లోనే బేకరీ పదార్థాలు తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఆఫ్లైన్తోపాటు ఆన్లైన్లో కూడా ఆర్డర్లు స్వీకరిస్తూ అమ్మకాలు జరుపుతున్నారు. ప్రసుత్తం ఇంట్లోనే నాణ్యతతో చేస్తుండడంతో ఆర్డర్లు బాగా వస్తున్నాయని, భవిష్యత్తులో వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. ఓ పక్క పేదలకు తనవంతు సేవలు అందిస్తూనే.. మరోపక్క వ్యాపారాన్ని కొనసాగిస్తానని వివరించారు.