‘నాన్నకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. చాలా సీరియస్ అని వైద్యులు చెప్పారు. మా నాన్న అంటే నాకు ప్రాణం. ఒక్కసారిగా నాన్నకు అంత సీరియస్ అని చెప్పగానే నా కాళ్ల కింద భూమి కంపించినట్టు అనిపించింది. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు వేయాలని డాక్టర్స్ చెప్పారు. వెంటనే ఆ ఇంజెక్షన్ల కోసం మెడికల్ స్టోర్స్ తిరిగాను. కానీ ఎక్కడా దొరకలేదు. బ్లాక్ మార్కెట్లో ధర రూ.30 వేల పైనే ఉంది. ఆ సమయంలో వెంటనే నేను కేటీఆర్ సర్కు ట్వీట్ చేశాను. సర్ టీం వెంటనే స్పందించి రెమ్డెసివిర్ సమకూర్చారు’ అని మహ్మద్ ఇబ్రహీం తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలే రెమ్డెసివిర్ బృందం ఏర్పాటుకు కారణమయ్యాయి.
కష్టకాలం.. ఒకరికి ఒకరు అండగా నిలిస్తేనే జయించగలం. కొవిడ్ ఆపత్కాలంలో సాయం చేసే చేతులకు కొదవలేదు. హైదరాబాదీలు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. ఆపదొస్తే అండగా నిలుస్తారు. ప్రస్తుతం రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉన్నది. ఎమ్మార్పీ రూ.3.500 ఉండే ఒక్కో ఇంజెక్షన్ను బ్లాక్లో రూ.30 వేలకుపైగా విక్రయిస్తున్నారు. నిరుపేదలు అంత పెద్ద మొత్తం చెల్లించలేని నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మార్పీ రేట్లకే ఇంజెక్షన్లు ఇప్పించేలా మహ్మద్ ఇబ్రహీం అనే యువకుడు రెమ్డెసివిర్ బృందాన్ని ఏర్పాటుచేశారు. తాను పడిన శ్రమ మరెవ్వరూ పడకూడదని బృందాన్ని ఏర్పాటుచేసినట్టు ఆయన తెలిపారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అవసరమున్న వారు 9885123440, 9885988503, 9030131380 నంబర్లకు ఫోన్ చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్, కొవిడ్ పాజిటివ్ రిపోర్టు, ఆధార్కార్డు హెటిరోలో చూపించి ఇంజెక్షన్ తీసుకోవచ్చని వెల్లడించారు. ఈ టీంలో 50 నుంచి 60 మంది సభ్యులు ఉంటారు. ఇంజెక్షన్ అవసరమున్న వారు ఫోన్చేస్తే చాలు వారే అంతా చూసుకుంటారు.
బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించొద్దు. కృత్రిమ కొరత సృష్టించి సామాన్యుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. అంది చాలా ప్రమాదకరం. మా నాన్నకు రెమ్డెసివిర్ అవసరం పడితే ఎంత కష్టపడ్డానే నాకే తెలుసు. అలాంటి కష్టం ఇంకెవ్వరూ పడొద్దని మేం మా స్నేహితులతో రెమ్డెసివిర్ టీంను ఏర్పాటుచేశాం. మాకు ఫోన్ చేస్తే ఆ ఇంజెక్షన్లు లభించే చోటు, ఎలా సమకూర్చుకోవాలే గైడ్ చేస్తున్నాం. ఇప్పటివరకు చాలా మందికి హెల్ప్ చేశాం. ఎవరైనా ఫోన్చేస్తే మేమే వారి దగ్గరికి వెళ్లి ఎమ్మార్పీ రేట్లకే ఇంజెక్షన్లు ఇప్పిస్తున్నాం. మహ్మద్ ఇబ్రహీం, రెమ్డెసివిర్ టీం
చాలామందికి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల పట్ల అవగాహన లేక బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. అది సరైనది కాదు. కొవిడ్ ఆపత్కాలంలో డబ్బు కోసం దిగజారడం మంచిది కాదు. ఆ ఇంజెక్షన్లతో ప్రాణాలు నిలబడుతున్నాయి. అలాంటి ఇంజెక్షన్లను అవసరమున్న వారికి దక్కకుండా బ్లాక్ మార్కెట్ అడ్డుకుంటున్నది. మేం ఆ బ్లాక్ మార్కెట్ను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాం. రెమ్డెసివిర్ అవసరమున్న వారికి అవి లభించే అడ్రస్, కంపెనీ ధరలకే అందేలా వారికి అవగాహన కల్పిస్తున్నాం. మహ్మద్ వసీం, సభ్యుడు