ఉన్నత చదువులు చదివాడు, విదేశాల్లో ఉద్యోగం చేశాడు. దేశ విదేశాల్లో పర్యటించి సామాజిక సేవపై పరిజ్ఞానం సాధించాడు. అయినా వాటిలో ఏ ఒక్కటీ తృప్తినివ్వలేదు. అధ్యాపక వృత్తిని వదిలి, సొంత స్థలంలో ఉచిత వృద్ధాశ్రమాన్ని నెలకొల్పాడు. నిరాదరణకు గురైన తల్లిదండ్రులను చేరదీసి, ఆప్తుడిగా సేవలందిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. మంచి చేయాలనే సంకల్పం ఉన్న వారికి అంతా మంచి జరుగుతుందని నమ్మే కృష్ణ మనోహర్ పెండ్లికి సైతం దూరమై సామాజిక సేవకే అంకితమయ్యాడు.
మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ దేవరయాంజల్లో కృష్ణ సదనం పేరుతో కృష్ణ మనోహర్ తన తండ్రి కొనుగోలు చేసిన మూడెకరాల స్థలంలో 2013లో వృద్ధాశ్రమాన్ని నెలకొల్పాడు. ఆశ్రమంలో చేరే వారి నుంచి పైసా ఆశించకుండా సేవలందిస్తున్నాడు. తండ్రి సహకారంతో 24 గంటలు అందుబాటులో ఉంటున్నాడు. సాధ్యం మేరకు తల్లిదండ్రుల నిరాదరణకు గురైన వారిని, పిల్లలు లేకుండా భారంగా బతుకుతున్న వారిని చేరదీస్తున్నారు. ఆశ్రమంలో చేరిన వారి జీవితాన్ని కేస్స్టడీగా స్వీకరించి, అవకాశం ఉంటే తల్లీబిడ్డలు కలిసి జీవించేలా పరివర్తన తీసుకువస్తున్నారు.
వృద్ధాశ్రమాలు మలిసంధ్యలో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కాదు. వృద్ధులు, మహిళలను సమాజం ఏ విధంగా ఆదరిస్తున్నదనే దానిపైనే నాగరికత వెల్లడవుతుంది. ప్రస్తుతం సొంతంగా తమ పని చేసుకునే వారికి ఆశ్రయం కల్పిస్తున్నాం. బెడ్ రిడన్ వాళ్లను కూడా తీసుకుంటాం. ఆశ్రమాల్లో చేరిన వారు పర్మినెంట్గా అక్కడే ఉండిపోకూడదు. వారి మనసుకు అయిన గాయాన్ని మాన్పి, తిరిగి బిడ్డల దరికి చేర్చే పరిస్థితులు ఆశ్రమాల్లో ఉండాలి. – కృష్ణ మనోహర్, కృష్ణ సదన్ నిర్వాహకుడు
నగరానికి చెందిన కృష్ణ మనోహర్ గచ్చిబౌలిలోని రోడామిస్త్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్లో 2003-06 వరకు బీఎస్డబ్ల్యూ(బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్), 2006-08 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్డబ్ల్యూ(మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్) పూర్తి చేశారు. అనంతరం జర్మనీ, డెన్మార్క్, స్వీడన్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, తైవాన్, సౌతాఫ్రికా, కెన్యా, నైజిరియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా తదితర దేశాల్లో పర్యటించారు. కొన్ని దేశాల్లో ఫెలోషిప్ చేయగా, మరికొన్ని దేశాలకు సోషల్ వర్క్లో ట్రైనర్గా వెళ్లారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు రోడామిస్త్రీ కళాశాలలో లెక్చరర్గా పని చేశారు. వివిధ దేశాల్లో పర్యటించినప్పుడు అక్కడి దేశాలు వృద్ధులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మన దేశంలో కల్పిస్తున్న సౌకర్యాలకు ఎంత తేడా ఉందో గుర్తించాడు. జాతి అభివృద్ధికి పాటు పడిన వృద్ధులకు ఇచ్చే గౌరవం ఇదా అని మదన పడ్డారు. వృద్ధులు సౌకర్యవంతంగా, గౌరవంగా బతికే పరిస్థితులు రావాలని భావించిన ఆయన వృద్ధాశ్రమ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.