సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆపదలో ఉన్నవారికి వీలైనంత చేయూతనివ్వడం ఎంతో అవసరం. అయితే కొందరు స్పందించి తమ వంతుగా ఎంతో కొంత మేలు చేయాలన్న సంకల్పంతో ముందుకువస్తున్నారు. ఇదే కోవలో టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సతీశ్రెడ్డి కొన్ని రోజులుగా తన వంతుగా కొవిడ్ రోగులకు ఇంటికే వెళ్లి రెండు పూటలా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. మిత్రులు కౌశిక్, రాజు, షఫీ, సంతోష్, రోహిత్తో జట్టుగా ఏర్పడిన సతీశ్రెడ్డి.. ప్రతిరోజూ ఉదయం, రాత్రి దాదాపు 100 మంది కొవిడ్ బాధితులకు భోజనాలను అందిస్తున్నారు. కరోనా సద్దుమణిగేంత వరకు.. ఇది కొనసాగుతుందని ఈ సందర్భంగా సతీశ్రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మంగళవారం నాగోల్, ఎల్బీనగర్, కొత్తపేట, ఉప్పల్, రామంతాపూర్, హబ్సీగూడ, మౌలాలి, బోడుప్పల్, మన్సూరాబాద్ తదితర ప్రాంతాల్లో ఐసొలేషన్లో ఉన్న బాధితులకు ఉచితంగా భోజనం అందించామని చెప్పారు. పౌష్టికాహారం కావాలనుకునే వారు 96414 66666, 73311 38990, 7893812990లలో సంప్రదించాలని సతీశ్రెడ్డి కోరారు.