ఆపద ప్రతి కుటుంబంలో ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది. ఆ సమయంలో అయినవారున్నా దగ్గరకు రారు. బంధువులు కన్నెత్తి చూడరు. స్నేహితులకు తెలిసినా పట్టించుకోరు. ఇలాంటి వారి కోసం దేశ, విదేశాల్లో ఉన్న వారి నుంచి విరాళాలు సేకరించి కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నారు కొందరు సహృదయులు. ఎలాంటి అండ లేని వారి విద్య, వైద్యానికి భరోసా ఇస్తున్నారు. సామాజిక మాధ్యమాల(సోషల్ మీడియా)నే వేదికగా చేసుకొని సమాజసేవ చేస్తున్నారు. తమ ఊరు, ప్రాంతం, రాష్ట్రమని కాకుండా ఎక్కడివారైనా మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. ఇక ఈ క్రౌడ్ ఫండింగ్లో అధికంగా యువతే ముందుంటుండగా, ఈ సేవలు రోజురోజుకూ ఇతర రంగాలకు విస్తరిస్తుండటం విశేషం. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అభాగ్యులకు ఆపద్బాంధవులవుతున్నారు. ఇవే కాకుండా పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి, శిక్షణ, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు విరాళాలు సేకరించి తోడ్పాటందిస్తున్నారు. బట్టలు, ఆహారాన్ని కూడా అందిస్తూ వారికి అండగా ఉంటున్నారు.
విద్య, వైద్యంతోపాటు ఇతర ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు కొందరు సామాజిక వేదికగా సంస్థను స్థాపిస్తారు. ఇవి తమకున్న నెట్వర్క్ను ఉపయోగించుకొని దేశ, విదేశాల్లో ఉన్నవారి నుంచి విరాళాలు సేకరించి సాయం అందిస్తాయి. అయితే సమకూరిన నిధుల నుంచి ఆయా సంస్థలు 2 నుంచి 5 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. తీసుకునే కమీషన్ ఫండ్ రైజింగ్ ప్రచారానికి, నిరంతరం పనిచేసే సిబ్బంది వేతనాల కోసమే. సమాచార మాధ్యమాల మద్దతు కూడా వీటికి ఎక్కువే.
సిటీబ్యూరో, మే13 (నమస్తే తెలంగాణ): మనిషి జీవితం అనేక సమస్యలమయం.. విద్యా, వైద్యం, జీవనభృతి ఇలాంటివి ఏవైనా కావొచ్చు.. సొంత వ్యాపారానికి, పరిశోధనలకు, ఇతర వాటికి కావాల్సిన పెట్టుబడి కోసం నిరుపేదలు పడే ఇబ్బందులు చెప్పనలవి కావు. అప్పులు ఇచ్చేవారుండరు. అండగా నిలిచేవారు.. కనిపించరు. తెలిసినవాళ్లు, స్నేహితులు తమ శక్తి మేరకు ఇచ్చినా అది అవసరాలకు తప్ప.. కష్టాలను అధిగమించేందుకు ఎటూ ఉపయోగపడదు. మరోవైపు సాయం చేసే ఆర్థిక స్థోమత ఉన్నా.. ఎవరికి ఇవ్వాలో తెలియని దయార్ధ హృదయులూ ఉన్నారు. అలాంటి వారిని ఒకే చోటుకు చేర్చే సంస్థలు, కొంతమంది మానవతావాదులు ఉన్నారు. సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసుకొని సమాజ సేవ చేస్తున్నారు. దేశ, విదేశాల్లో ఉన్న వారి నుంచి చిన్న మొత్తాల్లో విరాళాలను సేకరిస్తూ పేదలకు విద్యా, వైద్య సదుపాయాలను కల్పిస్తూ భరోసాగా నిలుస్తున్నారు. ఆర్థికంగా చేయూతనందిస్తూ నిరుపేదలకు బతుకుతోవను చూపుతున్నారు. తమ ఊరు.. ప్రాంతం, రాష్ట్రం అని కాకుండా ఎక్కడివారైనా.. సమస్య ఏదైనా.. సరే…మేమున్నామంటూ.. ముందుకొస్తున్నారు. మానవీయతను, సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. ఇక ఈ క్రౌడ్ ఫండింగ్లో ఎక్కువగా యువతే ముందుండగా, ఈ సేవలు రోజురోజుకూ ఇతరత్రా రంగాలకూ విస్తరిస్తుండడం విశేషం. కరోనా వేళ దిక్కుతోచని స్థితిలో పడిపోయిన అభాగ్యులకు ఆపద్బాంధవులవుతున్నారు.
ఏదైనా సామాజిక పరిశోధన, సేవలు చేసేందుకు అవసరమయ్యే నిధులను సమకూర్చుకునేందుకు కూడా చాలా మంది క్రౌడ్ ఫండింగ్ విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఉదాహరణకు ‘అన్లిమిటెడ్ హైదరాబాద్’ అనే సంస్థ స్టార్టప్ కంపెనీలను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్న వారికి అండగా నిలుస్తున్నది. సామాజిక సేవే ధ్యేయంగా పేదలకు అండగా నిలిచే ఆలోచన ఉన్నా, ఆర్థికంగా లేని స్టార్టప్ కంపెనీలకు ఇది వెన్నుదన్నుగా ఉంటున్నది. వివిధ బహుళజాతి ఐటీ కంపెనీల నుంచి నిధులను సేకరించి… వాటిని అలాంటి నూతన స్టార్టప్ కంపెనీల రూపకల్పనకు సమకూర్చుతున్నది. ఇలా ‘అన్లిమిటెడ్ హైదరాబాద్’ ఇప్పటి వరకు సుమారు రూ.40లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నిధులను సేకరించింది. ప్రస్తుతం విపరీతంగా ఆదరణ పొందుతున్న షేర్ రైడింగ్, రుబారు యాప్లు క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూపొందినవే. ఇవే కాకుండా మరికొందరు పర్యావరణ పరిరక్షణకు, గ్రామీణాభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి, శిక్షణ కార్యక్రమాలు, మహిళలకు స్వయం ఉపాధిని కల్పించేందుకు విరాళాలను సేకరిస్తున్నారు. దుస్తులు, ఆహారాన్ని సైతం సేకరిస్తూ పేదలు, యాచకులకు అందిస్తున్నారు.
ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిధులను సేకరించే సంస్థలు కూడా ఉన్నాయి. స్ఫూర్తి, సేవక్ ఫౌండేషన్, ఆరోహి, అరుణోదయ ట్రస్ట్ వంటివి అందులో కొన్ని. ఇవి సామాజిక మాధ్యమాలైన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలీగ్రామ్ వంటి వాటి ద్వారా నిధులను సేకరిస్తుంటాయి. ఇవి ఎక్కువగా ఒక ప్రాంతానికి, దేశానికి మాత్రమే పరిమితమైనవి. ఫండ్ రైజింగ్ను చేపడుతూ.. కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నాయి. వలస కార్మికులకు రేషన్ సరుకులు అందించడంతో పాటు రవాణా ఖర్చులు తదితర వాటిని సమకూర్చుతున్నాయి. కొన్ని ఆహారాన్ని, దుస్తులను సేకరిస్తూ పేదలకు అందిస్తున్నాయి.
ఫండ్ రైజింగ్ చేసే సంస్థలు పారదర్శకతకు పెద్దపీట వేస్తుంటాయి. తమ దృష్టికి వచ్చిన సమస్యల్లో ఏది అత్యవసరం? అందులో ఎంత నిజం? తదితర అంశాలన్నింటినీ పరిశీలించిన అనంతరమే అవి రంగంలోకి దిగుతాయి. తమ నెట్వర్క్ ద్వారా సదరు వ్యక్తుల గురించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించుకున్న తరువాతే బాధితుల తరఫున నిధుల సేకరణకు ఉపక్రమిస్తుంటాయి.
క్రౌడ్ ఫండింగ్ను చేపట్టే సంస్థలు దేశంలో ఇప్పటికే చాలా ప్రాచుర్యం పొందాయి. ‘మిలాప్, కెట్టో, కిక్స్టార్టర్, ఇండిగోగో, గో ఫండ్ మీ’ తదితర సంస్థలు అందులో కొన్ని. ఇవి తమకున్న నెట్వర్క్ను ఉపయోగించుకుని దేశ, విదేశాల్లో ఉన్నవారి నుంచి నిధులను సేకరించి సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి అందజేస్తున్నాయి. అయితే సమకూరిన నిధుల నుంచి ఆయా సంస్థలు 2 నుంచి 5 శాతం వరకు కమీషన్ను తీసుకుంటున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. అవి తీసుకునే కమీషన్ను ఫండ్ రైజింగ్ ప్రచారానికి, అందుకు కృషి చేస్తున్న సిబ్బంది వేతనాల కోసమే. ఇక ఈ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలోనూ నెట్వర్క్ కలిగి ఉన్నాయి. సమాచార మాధ్యమాల మద్దతు కూడా వీటికి ఎక్కువే. అదే విధంగా కొన్ని వైద్యశాలల్లో నేరుగా తమ సంస్థల ప్రతినిధులను నియమించుకుని తమ దృష్టికి వచ్చిన పేదల సమస్యల కోసం నిధులను సమకూర్చుతున్నాయి.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గడుసు లక్ష్మీరాజం అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టాడు. బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న భార్య గుండెపోటుతో కన్నుమూసింది. ఒకవైపు ఉండేందుకు కనీసం నిలువ నీడ కూడా లేదు. మరోవైపు ముగ్గురు ఆడపిల్లలు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. పూట గడవని దుస్థితి. ఆ కుటుంబ దయనీయ పరిస్థితిని గ్రామానికి చెందిన ఒకరు సమాజ సేవకులు రేణికుంట రమేశ్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆ కుటుంబ పూర్వాపరాలు తెలుసుకున్న ఆయన చలించిపోయారు. వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఫేస్బుక్ ద్వారా సహాయాన్ని అభ్యర్ధించారు. దాతల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వచ్చిన విరాళాలతో ఆ కుటుంబానికి ఇల్లు కట్టించారు రమేశ్, ఆయన మిత్రులు. ఇద్దరు అమ్మాయిలు స్కూల్కు వెళ్లేందుకు సైకిళ్లను కొనుగోలు చేసి ఇచ్చారు. కుటుంబానికి ఆర్థిక చేయూతనందించారు. దాతల సాయం వల్ల ఆ కుటుంబం నిలబడింది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లి కొత్తపల్లి గ్రామానికి చెందిన నిరుపేద ఐతరవేణి రమేశ్ కుమారుడు నిహాన్ కొద్ది రోజుల కిందట పచ్చ కామెర్లు, లివర్ సంబంధిత వ్యాధి బారిన పడ్డాడు. వైద్య ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ లేక, కుమారుడిని చూసి తట్టుకోలేక రమేశ్ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. సాయం కోరుతూ సేవక్ ఫౌండేషన్ సభ్యులను ఆశ్రయించాడు. వారు గ్రామానికి వెళ్లి పరిస్థితి రమేశ్ కుటుంబం, అతడి కుమారుడి అనారోగ్యానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. దాతల నుంచి విరాళాలను సేకరించారు. అలా వచ్చిన రూ.1.60 లక్షలతో బాలుడికి వైద్య చికిత్స చేయించి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
2015 అక్టోబర్లో తొలిసారిగా ఒక పాప వైద్యం కోసం ఫేస్బుక్ ద్వారా నిధులను సేకరించడం మొదలు పెట్టా. ఎంతో మంది ఎన్ఆర్ఐలు స్పందించారు. ఆ పాప వైద్యానికి రూ.3 లక్షలు అవసరం కాగా, ఏకంగా రూ.9 లక్షల నిధులు సమకూరాయి. ఆ తరువాత మరింత మందికి సాయం అందించాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. ప్రధానంగా విద్యా, వైద్యం, గూడులేనివారికి ఇంటిని నిర్మించి ఇవ్వాలనే ధ్యేయంతో దీనిని అలాగే కొనసాగిస్తున్నా. ఈ ఐదారేండ్లలో సుమారు రూ.కోటి 2లక్షల 70 వేల నిధులను సేకరించా. ఎంతో మంది ఎన్ఆర్ఐలు నన్ను ప్రోత్సహిస్తున్నారు. వారి వల్లే ఈ రోజు 81 మందికి అండగా నిలిచాం. అందులో 24 మందికి సొంతంగా ఇంటిని నిర్మించి ఇచ్చాం. దాతల సహకారం వల్లే ప్రతి నెలా ఒకరికి సాయం చేస్తూ వస్తున్నాం. ఇది ఎంతో తృప్తిని ఇస్తున్నది. కరోనా బాధితులకు సైతం రేషన్ సరుకులు, ఆర్థిక సాయం అందించాం. – రేణికుంట రమేశ్, ధర్మపురి, జగిత్యాల జిల్లా