కొవిడ్ బాధితులకు ఓ కుటుంబం అండగా నిలుస్తున్నది. ఉదయం లేచింది మొదలు టిఫిన్, డిన్నర్ అందించే బాధ్యత తీసుకుంటున్నది. ప్రస్తుత భయానక పరిస్థితుల్లో కరోనా రోగుల దగ్గరికి అయినవాళ్లు కూడా వెళ్లలేని దుస్థితి. సాయం మాట దేవుడెరుగు.. కనీసం వారిని పలకరించడానికి కూడా మొఖం చాటేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏమీ కాని కొందరు కొవిడ్ రోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. అండగా ఉంటూ భరోసానిస్తున్నారు. ఆకలి తీర్చి.. మానవత్వం చాటుకుంటున్నది ఆ కుటుంబం. నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ నిహారికా రెడ్డి కొవిడ్ బాధితుల కోసం ఇంట్లో స్వయంగా వంట తయారు చేసి అందిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులే వలంటీర్లుగా సేవ చేస్తున్నారు.
కొవిడ్ రోగుల ఆకలి తీర్చడమే కాకుండా.. ఇమ్యూనిటీ ఇచ్చే ఆహారాన్ని రెడీ చేస్తున్నారు నిహారిక కుటుంబ సభ్యులు. లంచ్, డిన్నర్ ఉచితంగానే అందిస్తున్నారు. పెరుగు, సలాడ్, పుల్కా, తాజా చట్నీ, బీట్రూట్, క్యారెట్ ఫ్రై, కూర, లెమన్ రైస్, సాంబారు, పప్పు, అరటిపండు, బాదంతో కూడిన లంచ్ను కొవిడ్ పేషెంట్లకు అందిస్తున్నారు. ఇక రాత్రి రెండు చపాతీలు, రసం, వైట్ రైస్, కర్రీ, ఫ్రై, సలాడ్, ఆపిల్, డ్రై ఫ్రూట్ లడ్డ్డూ, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అందిస్తున్నారు. మొత్తంగా నిహారిక తమ ఇంట్లో వారి ఆరోగ్యం కోసం తయారు చేసుకున్న వంటకాలనే కొవిడ్ రోగులకు అందిస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు. వీరి సేవలు పొందాలనుకునే వారు 9701821089 నెంబర్కు కాల్ చేసి చిరునామా చెబితే చాలు.. పోషకాహారం ఇంటికే పంపిస్తారు.
నిహారిక కుటుంబ సభ్యులు లక్ష్మి, ఐషూ, యశో, సౌమ్య, గణేశ్, నాగరాజు, కన్నన్ కొవిడ్ రోగులకు అండగా నిలుస్తున్నారు. పిల్లలు కూడా వంట తయారీలో సాయపడుతున్నారు. ఉదయం లేవగానే పనులు మొదలు పెడుతున్నారు. పాజిటివ్ వచ్చి అన్నం వండుకోలేని వారికి పోషకాహారం సమకూరుస్తూ శభాష్ అనిపిచుకుంటున్నారు. మొదటగా యూసుఫ్గూడ, శ్రీనగర్కాలనీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో సేవలు ప్రారంభించారు. రెండు రోజుల నుంచి నగర వ్యాప్తంగా తమ సేవలను విస్తరించారు.