తల్లి కరోనా బారిన పడింది. అంతే ఆదరణ అవసరమైన వేళ భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇరుగుపొరుగు వారు వారి వైపు కన్నెత్తి చూడలేదు. పలకరించేనాథుడు లేకుండా పోయాడు. ఆ కొడుకు ఒక్కడే తల్లిని చూసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఓ వైపు వైరస్ సోకిందనే గుబులు. మరోవైపు రక్తసంబంధీకులు, ఇరుగుపొరుగు వ్యవహరించిన తీరుతో మానసికంగా కుంగిపోయిన ఆ తల్లి కన్నుమూసింది. ఇదీ ఇటీవల పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసిన విషాదకర ఘటన. అతిభయంతో కుటుంబ బాంధవ్యాలు, ఇరుగుపొరుగు సంబంధాలు ఛిద్రమవుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితిని అధిగమించాలంటే సామాజిక ఐక్యత అతి ప్రధానం.
సిటీబ్యూరో, మే18 (నమస్తేతెలంగాణ): మనిషి జీవితం సమాజంతో ముడిపడి ఉంటుంది. ఇల్లు, పిల్లలు, బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారు..ఇలా ప్రతీదానితో మమేకమై ఉంటుంది. ప్రస్తుత ఆధునిక జీవన పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం మానవీయ సంబంధాలను కొంత దెబ్బతీయగా, ప్రస్తుతం కరోనా విషక్రిమితో ఆ సంబంధాలను మొత్తంగా దెబ్బతీస్తున్నది. సమాజాన్ని భయోత్పానికి గురిచేయడమే కాక, బంధాలను నిర్ధాక్షిణ్యంగా తెంపివేస్తున్నది. మానవీయ హృదయాలను కర్కశంగా మార్చివేస్తున్నది. ఈ అతిభయం అనేక అనర్థాలకు దారితీస్తున్నది. కరోనా బారిన పడిన కుటుంబాలను ఒంటరిగా మిగుల్చుతున్నది. మరింత మానసిక వేదనకు గురిచేస్తున్నది. వైరస్ శరీరాన్ని మెలిపెడుతుంటే.. సామాజిక వెలివేత, నిరాదరణ వారి మనసులను గాయం చేస్తున్నది.
కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందనేది నిజమే. అయితే భౌతికదూరం, శానిటైజేషన్, కనీస ముందస్తు రక్షణ చర్యలు తీసుకుంటే వైరస్ బారిన పడకుండా ఉంటారు. కానీ కరోనాపై అవగాహన రాహిత్యం.. సోకితే ప్రాణం పోతుందనే అతిభయమే ఇప్పుడు అనేక అనర్థాలకు దారితీస్తున్నది. పల్లెల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటున్నది. ఇరుగుపొరుగు లేదా తమ ప్రాంతంలో ఎవరికైనా కరోనా సోకిందని తెలిస్తే చాలు అతిభయంతో వణికిపోతున్నారు. ఆ ఇంటి దిక్కున కూడా కన్నెత్తి చూడడం లేదు. నిన్నమొన్నటి వరకు ఆత్మీయంగా పలకరించినవారే ఇప్పుడు పట్టించుకోవడం మానేశారు. అప్రకటిత సామాజిక వెలివేతను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పల్లెల్లో చాలామంది కరోనా లక్షణాలు కనిపించినా బయటకు చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. అనారోగ్యం బాధిస్తున్నా కొందరు ఇళ్లలోనే ఉండిపోతూ కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.