‘ఆమె పేరు పావని. ప్రైవేట్ టీచర్. కాలేజీ అడ్మిషన్ పనిమీద ఢిల్లీ వెళ్లారు. అక్కడ చాలామంది స్నేహితులు ఉన్నారు. కానీ వారితో ముఖ పరిచయం లేదు. వారున్నారనే నమ్మకంతో ఢిల్లీ వెళ్లి..వారి సాయంతో కాలేజీ అడ్మిషన్ పని ముగించుకొని తిరిగి నగరానికి చేరుకుంది. వారంతా ఆమెకు సోషల్ మీడియా స్నేహితులు.
అతడి పేరు విక్రమ్రాజ్. ఇటీవల కరోనా సోకగా,చికిత్స కోసం రూ.3 లక్షలు అవసరం పడింది. అప్పటికే అతడి కుటుంబం రూ.6 లక్షల వరకు ఖర్చు చేసింది. చేసేదేమీ లేక అతడు ఫేస్బుక్లో అన్నగా భావించిన వ్యక్తికి విషయం చేరవేశాడు. వెంటనే ఆ డబ్బును సమకూర్చి అతడు తమ్ముడిపై ప్రేమ చాటుకున్నాడు.
సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తేతెలంగాణ) : ఇప్పుడంతా సోషల్ మీడియా కాలం..పలకరింపులు తగ్గాయి. ఏదైనా చెప్పాలనకున్నా, సాయం చేయాలన్నా అంతా సోషల్ వేదిక ద్వారానే. ఎక్కడెక్కడో ఉన్న వారంతా సామాజిక మాధ్యమాల ద్వారా మరింత దగ్గరవుతున్నారు. నిత్యం విషయాలు, విశేషాలు, సంగతులు పంచుకుంటున్నారు. అమ్మా.. నాన్న.. అక్కా.. తమ్ముడు, స్నేహితుడు.. ఇప్పుడు ఈ బంధాలు సోషల్ మీడియాలో మరింత బలోపేతం అవుతున్నాయి. ప్రతీ విషయం పరస్పరం పంచుకుంటూ కుటుంబంలా మెదులుతున్నారు. సమస్య వస్తే వెంటనే స్పందిస్తూ బంధాలను మరింత బలంగా మార్చుకుంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న వారు అనేక వెబినార్లతో ఆత్మీయ కార్యక్రమాలు నిర్వహించుకునే ట్రెండ్ జోరందుకుంది.
నాకు బ్రదర్స్ లేరు. సోషల్ మీడియాలో ఓ అన్న దొరికాడు. మా అమ్మనాన్నలకూ ఎంతో ఇష్టం. ఏ కష్టమొచ్చినా అన్నయ్య వస్తాడనే భరోసా కలిగింది. మేం అందరం ప్రతి పండుగకు కలుసుకుంటాం. సోషల్ మీడియా ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఏ కష్టమొచ్చినా స్పందిస్తారనే నమ్మకం ఉంది. -స్రవంతి
సాధారణంగా ఇంట్లో కుటుంబసభ్యులు ఒకరినొకరు మాట్లాడుకునే సమయం..సందర్భాలు కొంచెం తగ్గాయని చెప్పొచ్చు. ఎవరి పని వారిది. ఎవరి టైం వారిది. కలిసున్నా పలకరింపులు అంతంతమాత్రమే. పనిఒత్తిడి..ఆర్థిక కారణాలు..ఇతరాత్ర ఇబ్బందులు ఇందుకు కారణం. అలాంటి పరిస్థితుల్లో వారు ఎక్కువగా సోషల్ మీడియాలోనే సమయాన్ని గడుపుతున్నారు. నచ్చిన పోస్టులు పెడుతూ, కావాల్సిన వారితో చాటింగ్ చేస్తూ విషయాలు పంచుకుంటున్నారు. సికింద్రాబాద్కు చెందిన శ్వేత..రుపోసో యాప్లో యాక్టివ్గా ఉంటుంది. తరుచూ సెంటిమెంట్ పాటల వీడియోలు పోస్ట్ చేస్తుంది. ఇలా అనేకమంది ఆమెకు ఫాలోవర్స్గా మారారు. కొంతమంది ఆమె చేసిన వీడియోలను పోస్ట్ చేస్తూ ప్రేమను చాటుకున్నారు. అందులో నగేశ్ అనే వ్యక్తి ఆమెను చెల్లెలిగా భావించి ప్రతి వీడియోను పోస్ట్ చేయడం ప్రారంభించాడు.
అలా వారిద్దరి మధ్య బంధం బలోపేతమైంది. గుంటూరుకు చెందిన రాజు తన ఫేస్బుక్ స్నేహితురాలిని కలిసేందుకు నగరంలోని మారేడుపల్లిలో ఉంటున్న భువనేశ్వరి ఇంటికి వచ్చాడు. ఇలా సోషల్ మీడియాలో బంధాలను సృష్టించుకోవడమే కాకుండా ఆర్థికంగానూ సహకరించుకుంటున్నారు. ఏదైన ఫంక్షన్ జరిగితే చాలు మొదటగా సోషల్ మీడియా బంధువులను ఆహ్వానిస్తున్నారు. ఇటీవల హిమాయత్నగర్కు చెందిన ప్రవళిక గృహ ప్రవేశం జరగగా, ఈ వేడుకకు సుదూర ప్రాంతాల నుంచి సోషల్ మీడియా అన్నలు, తమ్ముళ్లు, చెల్లెళ్లు, స్నేహితులు హాజరవడం విశేషం.
ఏ సమస్య వచ్చినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే..ఎవరో ఒకరు స్పందిస్తారు. ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగిస్తున్నారు. వీఐపీలు, రాజకీయ నాయకులతో సహా అందరితోనూ అభిప్రాయాలు పంచుకోవచ్చు. నాకు ఓ చెల్లెలు రుపోసో యాప్లో పరిచయమైంది. తను మా ఇంట్లో జరిగే అన్ని కార్యక్రమాలకు హాజరవుతుంది. -నరేశ్, ఐటీ ఉద్యోగి