సిటీబ్యూరో, జూన్13(నమస్తే తెలంగాణ): కరోనా కాలం.. కొంత మంది ఆకతాయిలకు వరంగా మారింది. సోషల్ మీడియా వేదికగా వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు.. గతంలో చోటుచేసుకున్న విబేధాలను మనస్సులో పెట్టుకుని..ఆ కోపాన్ని ఈ కరోనా, లాక్డౌన్ సమయంలో తీర్చుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది అధిక సమయం స్మార్ట్ఫోన్లపై ఉండటంతో.. వారి ఆలోచన ఇలా దారి మళ్లి..సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను సృష్టించి.. బాధితులను టార్గెట్ చేస్తున్నారు.
ముఖ్యంగా స్కూల్, కాలేజీ, కళాశాలలు, ఒకే కాలనీల్లో ఉండే యువతి, యువకుల స్నేహాలు బెడిసి కొట్టడం, మనస్పర్ధాలు, విబేధాలు ఏర్పడటం, అబ్బాయిల ప్రవర్తనతో వారిని దూరం పెట్టడం.. ఇలా ఇంకా అనేక అంశాల్లో గొడవలు జరిగి.. వారు తమ స్నేహాన్ని అర్ధంతరంగా కట్ చేసుకుంటున్నారు. అయి తే.. ఇలా అకస్మాత్తుగా స్నేహం దూరమవడం.. చాటింగ్ చేయకపోవడం, ఫోన్లో మాట్లాడక పోవడంతో చాలా మంది యవకులు వారిపై కోపాన్ని పెంచుకుంటున్నారు. ఎలాగైనా బాధితులను ఇబ్బందిపెట్టాలనే కోపంతో సోషల్ మీడియా వేదికగా నకిలీ ఐడీలను సృష్టించి.. టార్గెట్ అమ్మాయిలను వేధిస్తున్నారు.
దీనిపై బాధితుల ఫిర్యాదుతో సైబర్ క్రైం పోలీసులు.. కేసులు దర్యాప్తు చేపట్టి.. నిందితులను పట్టుకుని జైలుకు పంపుతున్నారు. ఇలా.. ఈ నెలన్నర రోజుల్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ విధంగా ప్రవర్తించిన 8 మందిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాధితులు వేధింపులకు భయపడొద్దని.. ధైర్యంగా ముందుకు వచ్చి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తే.. నిందితులను పక్కాగా పట్టుకుంటామని రాచకొండ సైబర్ క్రైం ఏసీపీ హరినాథ్ స్పష్టం చేశారు.