సిటీబ్యూరో, జూలై 8 (నమస్తేతెలంగాణ): గతంలో కంటే కరోనా పరిస్థితులు ఇరుగుపొరుగువారితో ఉన్న బంధాలను మరింత బలపడేలా చేశాయి. ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశాయి. మన చుట్టూ ఉన్న పరిసరాలు, ప్రజలతో మెలగాల్సిన ప్రాధాన్యతను పెంచాయని.. మైగేట్ యాప్ సంస్థ ట్రస్ట్ సర్కిల్ పేరుతో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడించింది. స్థానికులు, టెక్నాలజీ, సేవకులు, సెక్యూరిటీ సిబ్బంది తదితర అంశాలపై దేశవ్యాప్తంగా గేటెడ్, నాన్గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసముంటున్న 2867 మంది అభిప్రాయాలను నమోదు చేసింది.
హైదరాబాద్తోపాటు అహ్మదాబాద్, ముంబయి, ఢిల్లీ, జైపూర్, పూణె, బెంగళూరు, చెన్నై తదితర నగరవాసులను ప్రత్యక్షంగా, ఫోన్ ఇంటర్వ్యూల ద్వారా వివరాలు సేకరించింది. ఇందులో ప్రధానంగా యువకులు, మధ్య వయస్కులకు అధిక ప్రాధాన్యమివ్వగా..81 శాతం మంది కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇరుగుపొరుగు వారిపై ఆధారపడడం అధికమైందని వెల్లడించారు. 90 శాతం మంది తమ కమ్యూనిటీలోని సమస్యలను వెలికితీయడం, పరిష్కార మార్గాలను గుర్తించడం లాంటివి టెక్నాలజీ ఆధారంగా సులభతరమైందని తెలిపారు.
గతేడాది నుంచి పండుగలు, ఫంక్షన్లలో వేటికి ప్రాధాన్యమిస్తున్నారన్న ప్రశ్నకు 87.16 శాతం మంది సేఫ్టీ, సెక్యూరిటీ,భౌతికదూరానికి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. మంచి సంబంధాలతోనే ఒత్తిడి, ఒంటరితనం వంటి మానసిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని 90 శాతం మంది అంగీకరించినట్లు సంస్థ పేర్కొంది.