కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు బయటకెళ్లాలంటే భయపడుతున్నారు. ఒకవేళ వెళ్లినా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రజా రవాణా వ్యవస్థ మెట్రోరైలులో కరోనా నియంత్రణకు పక్కా చర్యలు తీసుకుంటున్నారు. మెట్రోరైలు, స్టేషన్లతోపాటు కౌంటర్ల వద్దకెళ్లి టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా మెట్రో స్మార్ట్ టికెటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ సాయంతో ఈజీగా ప్రయాణించేందుకు అవసరమైన టికెట్ ఏర్పాట్లు చేశారు. ప్రజారవాణా వ్యవస్థలో ఆర్టీసీ తర్వాత ఎక్కువమంది ప్రయాణం చేస్తున్నది మెట్రో రైళ్లల్లోనే. ప్రస్తుతం మూడు కారిడార్లలో అందుబాటులోకి రాగా, మొత్తం 69 కి.మీ మేర మెట్రోరైళ్లు ప్రతినిత్యం ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు నగరవాసులకు అందుబాటులో ఉన్నాయి.