కేపీహెచ్బీకాలనీ, మార్చి 7 : నగరంలో వాహనాల సంఖ్య దాదాపుగా 70 లక్షలకు చేరుకున్నది. వాటిలో 80 శాతం వాహనాలు రోజూ రోడ్లపై తిరుగుతున్నాయి. కొత్త వాహనాలూ పెరుగుతుండటంతో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు.. వాహనాలు నిలపాలంటే పార్కింగ్ సమస్య చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఇంటికో వాహనం ఉంటేనే గొప్ప. నేడు ప్రతి ఇంటికీ కనీసం రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారు ఉండటం సర్వసాధారణంగా మారింది. సంపన్న కుటుంబాలైతే అదనపు వాహనాలు అనేకం కనిపిస్తున్నాయి. నేడు చిన్న అవసరానికి కారు లేదా బైక్ తీసుకుని బయటికి వెళ్తున్నారు. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ అధికారులు పార్కింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కూకట్పల్లి జోన్ కేపీహెచ్బీకాలనీలో ‘స్మార్ట్ పార్కింగ్’ కేంద్రాన్ని సిద్ధం చేస్తుండటంతో పార్కింగ్ సమస్యకు పరిష్కారం లభించనుంది.
కేపీహెచ్బీకాలనీ హైటెక్సిటీ మార్గంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం కోసం రాజీవ్గాంధీ సర్కిల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించారు. ఈ బ్రిడ్జి కింది భాగంలో పిల్లర్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత ఆలోచన మేరకు ఓవైపు వినూత్నంగా తీర్చిదిద్దీ ఫ్లైఓవర్ పార్కును అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు ఉన్న ఖాళీ స్థలాన్ని స్మార్ట్ పార్కింగ్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా నగరంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. 200 ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసేలా వసతులను కల్పిస్తున్నారు. యాప్ ద్వారా పార్కింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. ఎన్ని వాహనాలను నిలిపారు.. తన వాహనం నిలపడానికి అవకాశముంటే వెంటనే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. కూకట్పల్లి పరిసర ప్రాంతాలకు వచ్చే ద్విచక్ర వాహనదారులు స్మార్ట్ఫోన్ ద్వారా స్లాట్ను బుక్ చేసుకుని అందులో వాహనాలను పార్కింగ్ చేసి దర్జాగా పనులు చేసుకోవచ్చు. వాహనం యొక్క స్థితిని ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్ ద్వారా కూడా పరిశీలించవచ్చు. 24 గంటలు.. 365 రోజులు స్మార్ట్ కేంద్రంలో వాహనాలను నిలపడానికి అవకాశముంది. నిర్వహణ కోసం ఒక వాహనానికి గంటకు రూ.10 చెల్లించాల్సి ఉంటుంది.
పెరిగిన జనాభాకనుగుణంగా వాహనాల సంఖ్య పెరుగుతుంది. వాహనదారుల సౌకర్యార్థం కేపీహెచ్బీకాలనీ ఫ్లైఓవర్ కింద స్మార్ట్ పార్కింగ్ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నాం. 200 ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయొచ్చు. గంటకు రూ.10 చొప్పున పార్కింగ్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా స్లాట్ను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తాం. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన దీన్ని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. – వి.మమత, జడ్సీ, కూకట్పల్లి జోన్