సైదాబాద్, ఆగస్టు 8 : సైదాబాద్ బాలుర సదనం (బాలల సంక్షేమ, సంస్కరణల వీధి బాలల సంక్షేమ సదనం-జువైనల్ హోం) నుంచి ఆదివారం సాయంత్రం 6 గురు బాలురు పరారయ్యారు. సదనం (హోం) గేట్ వద్ద కాపలాగా ఉన్న సూపర్వైజర్ను బలవంతంగా నెట్టివేసి, ఆతనిపై దాడిచేసి పరారయ్యారు. బీహార్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన పదిమంది బాలురు పథకం ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో లాకప్ చేసేటప్పడు వారందరు ఒక్కసారిగా గేట్ వద్ద కాపలగా ఉన్న సూపర్వైజర్ ఖదీర్ను నెట్టివేసి ఆతనిపై దాడిచేయటంతో కిందపడి పడిపోగానే వారందరు రోడ్ల వెంట పరుగులు పెట్టారు. రోడ్లపై పారిపోతున్న వారిలో స్థానికుల సహాయంతో హోం సిబ్బంది 4గురిని పట్టుకోగా మిగతా ఆరుగురు పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ సూపర్వైజర్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పారిపోయిన వారి ఆచూకీ కోసం హోం సిబ్బంది సీసీ కెమెరా పుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా బీహార్,ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన బాలురు నగరంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తుండగా వారం రోజుల క్రితం అధికారులు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న బాలలను గుర్తించి వారికి విముక్తి కల్పించి సైదాబాద్ బాలుర సదనంకు తరలించారు. బాలుర సదనం పర్యవేక్షణాధికారి ఎన్. నాగేశ్వర్రావు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పించుకున్న బాలుర కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.