రంగారెడ్డి, ఏప్రిల్ 7, (నమస్తే తెలంగాణ): గూడులేని పేదల సొంతింటి కలను త్వరలోనే నెరవేర్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. అర్హులకే డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల ఎంపికలోనూ ఎలాంటి అవకతవకలు జరుగకుండా పూర్తి పారదర్శకంగా చేపట్టనున్నారు. లబ్ధిదారుల ఎంపిక, ఇండ్ల కేటాయింపులోనూ లాటరీ పద్ధతిలోనే ఎంపిక చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం 1.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ప్రభుత్వం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అప్పగించింది.
సొంత స్థలం ఉంటే డబ్బులిచ్చేందుకు నిర్ణయం
సొంత స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే లబ్ధిదారులకు అందించనున్నది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు రానున్నాయి. జిల్లాలో చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, షాద్నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్ ఖర్చు రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. మౌలిక వసతుల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.25 లక్షలు, అర్బన్ ప్రాంతంలో రూ.75 వేలను డ్రైనేజీ, నీటి వసతి తదితర వసతులను అందజేయనున్నది.
పూర్తైన 2221డబుల్ ఇండ్లు..
జిల్లాలో వ్యక్తిగత ఇండ్లతోపాటు జీ ప్లస్2, జీ ప్లస్3గా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరుగుతుంది. జిల్లావ్యాప్తంగా 2221 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యాయి. వీటిలో 1880 ఇండ్లు షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించినవి కావడం గమనార్హం. గుండ్లకుంట గ్రామంలో 925(జీప్లస్-3) ఇండ్లు, దూస్కల్ రోడ్లో 370(జీప్లస్-3), సోలిపూర్లో 405 (జీప్లస్-3), నందిగామ మండలంలోని నందిగామ గ్రామంలో 120(జిప్లస్-2), కొత్తూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో 60 (జీప్లస్-2) ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలం లింగంపల్లిలో 96(జీప్లస్-2), అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బండరావిర్యాలలో 35(వ్యక్తిగత) డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయ్యాయి.
అర్బన్ ప్రాంతానికి సంబంధించి.. మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్నగర్ మండలం మీర్పేట్లో 80 (జీప్లస్-3) పూర్తికాగా, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గండిపేట మండలంలోని బైరంగూడలో 50 (జీప్లస్-2), కిస్మత్పూర్లో 60(జీప్లస్-2), శంషాబాద్ మండలం హామీదుల్లానగర్లో 20 (జిప్లస్-2) పూర్తయ్యాయి. జిల్లాకు 6777 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, చేవెళ్ల నియోజకవర్గానికి 1060, కల్వకుర్తికి 738, ఇబ్రహీంపట్నానికి 1239, షాద్నగర్ నియోజకవర్గానికి 3100, రాజేంద్రనగర్కు 240, మహేశ్వరం నియోజకవర్గానికి 400 ఇండ్లు మంజూరయ్యాయి. 6383 ఇండ్లకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. 309 ఇండ్లు ఇప్పటికే పూర్తికాగా, ప్రస్తుతం 2221 ఇండ్లు పూర్తయ్యాయి. మిగతా వాటిలో మరో 2757 ప్రారంభంకాగా వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
ఇవీ కూడా చదవండీ..
70 ఏండ్ల తర్వాత అమర సైనికుడి భార్యకు పెన్షన్
గని కార్మికులను ఆదుకుంటాం : మంత్రి ఎర్రబెల్లి
బిగ్బాస్ ఫేమ్ సోహెల్ ఓవరాక్షన్.. అవసరమా?