మెట్పల్లి, ఏప్రిల్ 4: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. ఈ సినీ గీతం ఆ యువకుడి జీవితానికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. సర్కారు కొలువు సాధించడమే గగనమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అతడు ఏకంగా రెండేళ్లలో రెండు ఉద్యోగాలు సాధించాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి నిర్విరామంగా శ్రమించి కన్నవారి కలలను నెరవేర్చాడు మొగిలిపేటకు చెందిన మోరపాక శ్రీనివాస్. మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చెందిన మోరపాక శ్రీనివాస్. తల్లిదండ్రులు లక్ష్మి, లచ్చన్న నిరక్షరాస్యులు. కూలీనాలీ చేస్తూ బతుకులు వెల్లదీసేవారు. కనీపెంచిన వారి కష్టాలను చూస్తూ పెరిగిన శ్రీనివాస్ వారి ఇక్కట్లను దూరం చేసేందుకు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. సొంతూరిలోని జడ్పీ స్కూల్లో పదో తరగతి పూర్తి చేశాడు. మెట్పల్లిలో ఇంటర్, హైదరాబాద్లో డిగ్రీ. నిజాం కళాశాలలో ఎంఏ అర్థశాస్త్రం పూర్తి చేశాడు. అక్కడే బీఈడీ సైతం చదివాడు. తెలంగాణ ప్రభుత్వం 2016లో టీఎస్పీఏస్సీ ద్వారా గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయగా శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నాడు. రాత్రింబవళ్లు శ్రమించి 2017లో పరీక్ష రాశాడు. ఆ తర్వాత 2017లో నిర్వహించిన డీఎస్సీ రాసి స్కూల్ అసిస్టెంట్గా ఎంపికయ్యాడు. తాను చదువుకున్న పాఠశాలలోనే ఉద్యోగంలో చేరాడు. 2019లో గ్రూప్-2 ఫలితాలు రాగా, అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ క్లస్టర్లో సహకార సొసైటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఇవి కూడా చూడండి..
మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ