సిటీబ్యూరో, మే 28(నమస్తే తెలంగాణ): ఇష్టానుసారంగా రోగుల వద్ద నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తున్న ప్రైవేటు దవాఖానలపై సర్కార్ కొరడా ఝళిపించింది. పలు ఆస్పత్రులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో సదరు దవాఖానలపై కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేయడంతో రంగంలోకి దిగిన ప్రజా ఆరోగ్య సంచాలకులు ఆరోపణలు ఎదుర్కొంటున్న దవాఖానలను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీచేశారు. అవసరానికి మించి అధిక బిల్లులు వేస్తున్నారంటూ రోగుల కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదులు అందినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అంతే కాకుండా కొన్ని దవాఖానల నిర్వాహకులు ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు విరుద్ధంగా చికిత్స అందించడం, చికిత్స అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తదితర ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే..అధిక బిల్లులు ఎందుకు వసూలు చేశారో కారణాలు చెప్పాలంటూ 54 దవాఖానలకు అధికారులు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీచేశారు.
అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు విరుద్ధంగా చికిత్స చేయడం, వైద్యం అందించడంలో నిర్లక్ష్య వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రేటర్ పరిధిలోని 5 కార్పొరేట్ దవాఖానలకు కరోనా చికిత్సకి సంబంధించి లైసెన్స్ను రద్దు చేస్తూ ప్రజారోగ్య సంచాలకులు ఆదేశాలు జారీచేశారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు విరుద్ధంగా వైద్యం అందించడంతో పాటు చికిత్స చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు చికిత్స పొందుతూ మృతిచెందిన నల్గొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విరించి దవాఖానలో కరోనా చికిత్సకు సంబంధించిన అనుమతిని రద్దుచేస్తూ ఆదేశాలు జారీచేశారు. విరించితో పాటు విన్, టీఎక్స్, నీలిమ, మాక్స్ హెల్త్ దవాఖానల్లో కరోనా చికిత్సకు అనుమతి రద్దుచేశారు. అయితే ఆదేశాలకు పూర్వం దవాఖానల్లో చేరిన చికిత్స పొందుతున్నవారికి మాత్రమే కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం చికిత్స అందించాలని కొత్త రోగులను చేర్చుకోరాదని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.