హయత్నగర్, మే 24 : ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఉపాధ్యాయురాలు సజీవదహనం కాగా ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన భర్తకు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… నల్గొండ జిల్లాకు చెందిన చల్లం బాలకృష్ణ, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వనస్థలిపురంలోని ఎఫ్సీఐ కాలనీ, రోడ్డు నం.1, ప్లాట్ నం.259లో నివాసముంటున్నారు. బాలకృష్ణ నల్లొండ జిల్లా, బాపనవెల్లంల గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన మొదటి భార్య యాక్సిడెంట్లో మరణించింది. ఆమెకు కుమారుడు వెంకట రమణరావు ఉన్నాడు.
అతను శంషాబాద్లోని తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన ఎర్ర సరస్వతి(42)ను బాలకృష్ణ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు అక్షిత ఉన్నది. సరస్వతి ఎల్బీనగర్లోని బహుదూర్నగర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్గా విధులు నిర్వహిస్తున్నది. గత కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. పిల్లలతో కలిసి వారు బెడ్ రూములోనే పడుకున్నారు. ఉదయం భార్యాభర్తలు ఇద్దరూ బెడ్రూంలో ఉండగా కూతురు అక్షిత ఆన్లైన్ క్లాసుల కోసం తన గదికి వెళ్లింది.
కుమారుడు వెంకటరమణరావు బయటికి వెళ్లి వచ్చాడు. తల్లిదండ్రులు ఉన్న బెడ్ రూంలో పెద్దశబ్దం వచ్చి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన పిల్లలు వెంటనే బెడ్రూంలోకి వెళ్లి చూడగా.. మంటల్లో కాలిపోతున్న తల్లి సరస్వతిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. సరస్వతిని కాపాడే క్రమంలో బాలకృష్ణకు మంటలంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కూతు రు అక్షిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.