అబిడ్స్, ఏప్రిల్ 8 :బేగంబజార్ ప్రధాన మార్కెట్లో కరోనా నిబంధనలను వ్యాపారస్తులు, కొనుగోలు దారులు తప్పక పాటించాలని ది హైదరాబాద్ కిరాణా మర్చం ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేశ్కుమార్ అగర్వాల్, సలహాదారులు జీవన్లాల్ భాటి, ఉపాధ్యక్షుడు కైలాష్ మంత్రి, సంయుక్త కార్యదర్శి అవినాశ్ పేర్కొన్నారు. గురువారం బేగంబజార్లోని అసోసియేషన్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ఈ నెల 9 నుంచి ప్రతి నిత్యం సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరిచి ఉంచుతామన్నారు. దుకాణాలకు సరుకుల కొనుగోలు కోసం వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని, అదే విధంగా భౌతిక దూ రం పాటించాలని కోరారు. మాస్క్లను ధరించని వారికి అసోసియేషన్ తరపున మాస్క్లు ఇచ్చి.. మరీ వారు మాస్క్లు ధరించేలా చూస్తామన్నారు. వ్యాపారస్తులు, కొనుగోలు దారులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించి కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. బేగంబజార్ పరిసర ప్రాంతాల్లో 50 మంది వ్యాపారస్తులకు కరోనా సోకడం బాధాకరమని, వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.