వెంగళరావునగర్, జూలై 24: విధి ఆమె జీవితంతో ఆడుకుంది. ఊహించని మలుపులతో ఆమె జీవితం తెగిన గాలిపటమైంది. విధి ఆమె జీవితంతో చెలగాటమాడింది. పెద్దల్ని కాదని కులాంతర వివాహం చేసుకుంది. ఓ బిడ్డకు తైల్లెంది. కొంత కాలానికే కట్టుకున్నోడు కాలం చేశాడు. కష్టాల కడలిలో ఎదురీదుతున్న ఆమె జీవితంలో తోడుంటానని చెప్పి ఓ యువకుడు ఆమెను పెళ్లాడాడు. నిన్ను, నీ బిడ్డను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటానన్నాడు. రెండో భర్తతో జరిగిన కాపురానికి గుర్తుగా మరో ఆడపిల్ల వారికి కలిగింది. కొన్నేళ్లకు ఆ యువతికి క్షయ వ్యాధి సోకి ముదిరింది. జీవిత చరమాంకంలో ఉన్న సహచరిని నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డుపై వదిలేశాడు. అచేతనాస్థితిలో ఉన్న ఆ దీనురాలిని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలొదిలింది. బిడ్డలనే జాలి కూడా లేకుండా ఇద్దరు పసిబిడ్డలను బస్టాప్లో విడిచి పారిపోయాడు ఆ కఠినాత్ముడు. ఆకలి దప్పులతో అలమటిస్తూ.. అనాథలుగా మారిన ఆ చిన్నారులను పోలీసులు శిశువిహార్కు తరలించారు. హృదయ విదారక ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
కర్ణాటక చెందిన పున్ని అనే యువతికి ఏడేళ్ల క్రితం ఇబ్రహీంతో కులాంతర వివాహమైంది. వారికి మహేశ్వరి అనే పాప కలిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇబ్రహీం ఐదేళ్ల క్రితం చనిపోవడంతో రెండో భర్తగా మల్లయ్య ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టపడని ఆమె తల్లిదండ్రులు ఆమెను ఏడేళ్ల క్రితం నుంచే పట్టించుకోవడమే మానేశారు. తోడుగా ఉంటానని బాసలు చేసిన రెండో భర్త మల్లయ్య రాక్షసుడిగా మారుతాడని ఏనాడూ ఊహించలేదు ఆ అమాయకురాలు. పున్ని, మల్లయ్య దాంపత్యానికి రెండున్నరేళ్ల పాప సంతానమైంది. భర్తను, ఇద్దరు ఆడ పిల్లలను కంటికి రెప్పలా చూసుకునేది ఆ ఇల్లాలు. పున్నికి క్షయ వ్యాధి సోకడంతో ఆ కుటుంబానికి పెను తుఫాన్ తాకినైట్టెంది. భార్య పున్నికి వైద్యం చేయించి కాపాడుకోవాల్సిన భర్త మల్లయ్య ఆ బాధ్యతను మరిచాడు. ఆమె ఆరోగ్యం గురించి ఏనాడూ పట్టించుకోలేదు. దాంతో పున్ని నీరసించి.. కృశించి అచేతనాస్థితిలో ఉన్న ఆమెను బోరబండ బస్టాపులో వదిలేశాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను ఉస్మానియా ఆసుపత్రిలో పోలీసులు చేర్చారు. క్షయ వ్యాధి ముదిరిందని నిర్ధారణ కావడంతో ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతి దవాఖానకు పంపారు. ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ నిర్భాగ్యురాలు ప్రాణాలొదిలింది.
కన్న మమకారం కూడా లేకుండా.. రెండున్నరేళ్ల పాప బేబితో పాటు ఆమె అక్క ఆరేళ్ల మహేశ్వరిని బస్టాపులో విడిచి పారిపోయా డు తండ్రి మల్లయ్య. రోగమొచ్చిందని భార్యను వదిలించుకుని.. ఆడ పిల్లల సంతానమనే సాకుతో.. బోరబండ బస్టాపులో పిల్లల్ని విడిచి ఇప్పుడే వస్తానంటూ పారిపోయాడు. ఆకలి దప్పులతో అల్లాడే ఆ పసిబిడ్డలను చూసిన స్థానికులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ పసిబిడ్డలను యూసుఫ్ గూడ స్టేట్ హోంలోని శిశువిహార్లో చేర్పించారు.
మా అమ్మ ఆసుపత్రిలో ఉంది.. మా కోసం వస్తుందని పిల్లలు ఎదురుచూస్తున్నారు. అమ్మ లేదని.. ఇక రాదన్న నిజం ఈ పసిబిడ్డలకు తెలీదు. ఈ పసి మనసుల్ని గాయపర్చడం ఇష్టం లేక వీరికి చెప్పడానికి కూడా ఎవరూ సాహసించ లేదు. తండ్రి ప్రేమకు దూరమై.. తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో పిల్లల పరిస్థితిని చూసి స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లి తరపు బంధువులు ఇదే ప్రాంతంలో ఉంటున్నప్పటికీ.. తమను కాదని ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకోవడం వల్లే ఆమెకు ఈ పరిస్థితి దాపురించిందంటూ పిల్లలను చూడ్డానికి కూడా వారికి మనసు రాలేదు. పున్ని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఆమె సోదరుడు, సోదరి నిరాసక్తత చూపుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. బల్దియా సిబ్బందికి సమాచారమిచ్చి.. ఆమె అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని వారు తెలిపారు.