దేశంలో ఎక్కడా లేని విధంగా సైబరాబాద్ షీ టీమ్స్ అర్ధరాత్రి సమయంలో కూడా మహిళల భద్రత కోసం హాట్ స్పాట్స్లో మాటు వేస్తున్నారు. వారి జోలికి వెళ్లేవారి భరతం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 24/7 షీ టీమ్స్ మహిళల రక్షణ కోసం అండగా ఉంటున్నాయి. అర్ధరాత్రి కూడా మహిళలు స్వేచ్ఛగా తిరిగేందుకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. దీంతో ఇప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటైనా ఐటీ కారిడార్లో ఉద్యోగినిలు ఎలాంటి ఆటంకాలు లేకుండా తిరుగుతున్నారు. ఇందు కోసం ప్రత్యేక షీటీమ్ బృందాలు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జాము వరకు మఫ్టీలో పనిచేస్తున్నాయి. డెకాయ్ ఆపరేషన్లతో పోకిరీల బెడదను తీరుస్తున్నారు. ఆకతాయిలు కనబడగానే వారు చేసే వెకిలి చేష్టలను ప్రత్యక్షంగా రికార్డు చేసి, వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఆకతాయిలు మహిళల జోలికి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఒక ప్రణాళిక బద్ధంగా అర్ధరాత్రి సమయంలో షీ టీమ్స్ ఉద్యోగినులకు సేఫ్ రూట్ను అందిస్తున్నాయి.
సైబరాబాద్ పరిధిలో గత మూడు రోజులుగా కేపీహెచ్బీ, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 నుంచి ఒంటిగంట, 1 నుంచి 2 గంటలు, 4 నుంచి 5 గంటల సమయంలో ఉద్యోగినిలు, ఇతర మహిళలను చూసి అసభ్యంగా ప్రవర్తించిన 18 మందిపై కేసులు నమోదు చేశారు. గత ఆరు నెలలుగా అర్ధరాత్రి సమయంలో ఐటీ ఉద్యోగినిలు, ఇతర మహిళలను తమ అసభ్యకరమైన చేష్టలతో ఇబ్బంది పెట్టిన దాదాపు 50 మందిపై సైబరాబాద్ షీ టీమ్స్ ఈవ్ టీజింగ్ కేసులు నమోదు చేశాయి. అర్ధరాత్రి మహిళలు, ఐటీ ఉద్యోగినిలకు ఈవ్ టీజర్లతో ఇబ్బందులు ఎదురైతే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని సైబరాబాద్ షీ టీమ్స్ అధికారులు కోరుతున్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ అత్యంత వేగంగా స్పందిస్తాయని సైబరాబాద్ షీ టీమ్స్ డీసీపీ అనసూయ స్పష్టం చేశారు.
అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జాము వరకు చాలా మంది ఐటీ ఉద్యోగినిలు వారికి కేటాయించే సమయానుసారంగా విధులు ముగించుకొని తిరిగి ఇంటి వెళ్తుంటారు. ఈ సమయాన్ని ఎంచుకున్న పోకిరీలు క్యాబ్ల కోసం వేచి ఉండే వారిని, మెట్రో స్టేషన్లో చివరి రైలు దిగి ఇంటికి చేరుకునేందుకు బస్సులు, ఆటోల కోసం మహిళలు నిలబడే ప్రాంతాల్లో తిష్ట వేస్తున్నారు. ఈ పరిస్థితులపై షీటీ మ్స్ కు సమాచారం అందింది. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, షీ టీమ్స్ డీసీపీ అనసూయ ఓ ప్రణాళికను రూపొందించి మాదాపూర్, గచ్చిబౌలి, కేపీహెచ్బీ, రాయదుర్గం, కూకట్పల్లి, మియాపూర్ మరికొన్ని ప్రాంతా ల్లో హాట్స్పాట్స్ను గుర్తించారు. ఆ ప్రాంతంలో మఫ్టీలో షీ టీ మ్స్ను దింపారు. పోకిరీల చేష్టలను గుర్తించి, వీడియో రికార్డ్ చేసి అదుపులోకి తీసుకుంటున్నారు. ఆ తర్వాత వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కేసులు నమో దు చేస్తున్నారు. వారి పేర్లను ఈవ్ టీజర్స్ రికార్డులోకి ఎక్కిస్తున్నారు. దీంతో ఈ పోకిరీలు మరెక్కడైనా అరెస్టయితే వారి వివరాలు పోలీసు రికార్డులో బయటపడుతున్నాయి. షీ టీమ్స్ బృందాలు పోకిరీల ఆగడాలకు చెక్ పెడుతూ ఏనీ టైం మహిళలకు సురక్షితమైన ప్రాంతంగా సైబరాబాద్ను తీర్చిదిద్దుతున్నారు.