మేడ్చల్, సెప్టెంబర్3(నమస్తే తెలంగాణ): ఎస్సీ నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశం కల్పించేందుకు (షీ క్యాబ్) పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వం సబ్సిడీపై వాహనాలను అందించనున్నది. షీ క్యాబ్ వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు వాహనాలను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించి ఉపాధి కల్పించనున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా (షీ క్యాబ్) వాహనాల కోసం 64 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు.
రూ. 8 లక్షల వాహనాన్ని (షీ క్యాబ్) పైలెట్ ప్రాజెక్ట్ పథకం కింద ఎస్సీ కార్పొరేషన్ 60 శాతం సబ్సిడీ ఇచ్చి మిగతా 40 శాతం వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వాహనాలు అందజేస్తారు. ఎస్సీ కార్పొరేషన్ రూ. 5 లక్షలు, బ్యాంకుల నుంచి రూ. 3 లక్షల రుణాలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ. 3 లక్షలు రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
(షీ క్యాబ్) పైలెట్ ప్రాజెక్ట్ పథకంలో వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి డ్రైవింగ్లో శిక్షణ నిచ్చి వాహనాలు అందించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి మొదటి బ్యాచ్లో 25 మందికి ఉచితంగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించారు. 21 రోజుల పాటు శిక్షణ అనంతరం డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత సబ్సిడీపై వాహనాలు అందిస్తారు.
నిరుద్యోగ ఎస్సీ మహిళలు షీ క్యాబ్ పొందేందుకు ఉండాల్సిన అర్హతలు. 10వ తరగతి చదివి ఉండాలి. ఉతీర్ణులైనా కాకున్నా..అర్హులే. 18 నుంచి 50 ఏండ్ల మధ్య ఉండాలి. సంవత్సర ఆదాయం లక్షన్నరకు మించి లేని వారందరూ అర్హులే.
షీ క్యాబ్ పైలెట్ పథకం కింద నిరుద్యోగ ఎస్సీ మహిళలకు సబ్సిడీ పై వాహనాలు అందిస్తున్నాం. రూ. 8 లక్షల వాహనానికి 60 శాతం సబ్సిడీని ఎస్సీ కార్పొరేషన్, మిగతా 40 శాతం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తాం. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా శిక్షణ అందిస్తున్నాం. -డి.బాలాజీ , ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి,