అబిడ్స్, సెప్టెంబర్ 4 : కట్టెలమండిలోని ఆంధ్ర విద్యాలయ పాఠశాలను శనివారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి.. విద్యార్థుల హాజరును అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను పరిశీలించి.. విద్యార్థులతో కరోనా జాగ్రత్తలపై చర్చించారు. ప్రతి రోజు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలకు హాజరు కావాలని సూచించారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులు వ్యాక్సిన్ వేసుకున్నారా?.. లేదా?.. అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొందరు విద్యార్థులు చేసిన చేతి వృత్తులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి కలెక్టర్ను అయ్యానని, మీరు కూడా బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చల్లా శ్రీనివాస్రెడ్డి.. విద్యార్థులు కరోనా జాగ్రత్తలు తీసుకునేలా చూస్తున్నామని వివరించారు. ఉపాధ్యాయులు హేమ, మంజుల, ప్రమీల, కవిత, జ్యోతి, సునీతలు కలెక్టర్కు తరగతి గదులను చూపించారు.