హకీంపేటలో నివాసముండే ఇక్బాల్ (28) బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చాలాకాలంగా ఉద్యోగం లేకపోవడంతో పాటు తల్లి అనారోగ్యంతో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. దాంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. మనశ్శాంతి కోసం వెతుకుతున్నా.. చావొక్కటే దానికి మార్గమంటూ వాట్సాప్ స్టేటస్లో వీడియో పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ప్రియాంక (28) అన్వేష్లు భార్యాభర్తలు. వీరిద్దరికి 2020లో వివాహం జరిగింది. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. కొవిడ్ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. చిన్నచిన్న విషయాలకు ఇద్దరు గొడవ పడేవారు. మనస్తాపం చెందిన ప్రియాంక ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇన్స్టాగ్రామ్లో ఓ యువతి, యువకుడు పరిచయం అయ్యారు. ఇద్దరి మధ్య కొన్నాళ్లు సాగిన స్నేహం ప్రేమగా మారింది. పెండ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు మోసం చేయడంతో ఈ విషయం పెద్దల వరకు వెళ్లింది. ఇంతలో ఆ యువకుడు సెల్ స్విచ్ఛాప్ చేయడంతో భయపడిపోయిన యువతి ఆత్మహత్య చేసుకుంది.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ అలా చేయకుండా చాలామంది ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో వందేండ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రాణాలు తీసుకోవాలనుకునే వారికి బాసటగా నిలిచేలా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సైకాలజిస్టులు పిలుపునిస్తున్నారు. సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా ప్రత్యేక కథనం..
తెలంగాణ సైకాలజిస్టుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఆత్మహత్యలు నివారించడానికి కృషి చేస్తామని సైకాలజిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు మోతుకూరి రాంచందర్ తెలిపారు. ఈ నెల 14 వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో కూడా కౌన్సెలింగ్ చేయడానికి ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్టులు అందుబాటులో ఉన్నారని ఆయన వివరించారు.
ఒంటరితనం, వరకట్న వేధింపులు, వివాహేతర సంబంధాలు, పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, సంతానలేమి, అనారోగ్యం, దీర్ఘకాలిక రోగాలు, మానసిక సమస్యలు, ఆత్మీయులను కోల్పోయిన బాధ, ప్రేమ విఫలం, భూ వివాదాలతో ప్రాణాలు తీసుకుంటున్నారని.. మరికొన్ని కేసుల్లో కారణాలు తెలియరావడం లేదని మెదడులోని రసాయనిక సమతుల్యత లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. న్యూరో ట్రాన్స్మీటర్స్ లేక న్యూరో కెమికల్స్ మెదడులో చురుకుగా లేకపోవడంతో ఈ సమస్య తీవ్రమవుతోందని హెచ్చరిస్తున్నారు.
కొత్త విషయాలపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మనలో ఉన్న నెగెటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి.
నెగెటివ్ ఆలోచనలకు స్వస్తి చెప్పి.. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలన్న ధైర్యంతో ఉండాలి.
మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సమస్య నుంచి బయటపడే కోణంలో ఆలోచన చేయాలి.
రోజూ వ్యాయామం చేస్తే మెదడు బాగా పనిచేస్తుంది. పుస్త్తక పఠనం అనేది బ్రెయిన్కు మంచి వ్యాయామం. మెదడులోని న్యూరాన్లను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఉపయోగపడుతుంది.
హిమాయత్నగర్, సెప్టెంబర్ 8: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంలో భాగంగా ఈ నెల 14 నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోతుకూరి రాం చందర్ తెలిపారు. బుధవారం జూమ్ ద్వారా అవగాహన కార్యక్రమా న్ని నిర్వహించారు. సమావేశంలో అసోసియేషన్ సభ్యులు వెంపటి రాజు, లక్ష్మి, సుబ్రహ్మణ్యం, కృష్ణ, కవిత పాల్గొన్నారు.