సిటీబ్యూరో, అగస్టు 5(నమస్తే తెలంగాణ)/ శంషాబాద్ : ఓ వ్యక్తి తన జేబులోంచి రూ. 500 తీసి యాచకుడికి ఇచ్చాడు. ఆ నోటు అందుకున్న వ్యక్తి దానిని చూసి మురిసిపోయాడు. ఇంతలో మరో యాచకురాలికి అతడు రూ. 500 ఇచ్చాడు. ఇలా దేవాలయం, రైల్వే స్టేషన్, భోజనం చేసిన హోటళ్ల వద్ద సుమారు 100 మంది భిక్షాటన చేసే వారికి రూ. 50 వేల వరకు దానం చేశాడు. ఈ దానాలన్నీ యూపీలోని వారణాసిలో చేశాడు. అతడు వ్యాపారి కాదు.. ఓ చీటర్ అవును ఇది నిజం.. తక్కువ ధరలో బంగారం ఇప్పిస్తానని మోసం చేసిన కడప జిల్లాకు చెందిన అవ్వారు సుధాకర్(33) డబ్బుతో ఇలా డాబు ప్రదర్శించాడు. గురువారం ఇతడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా, విచారణ సమయంలో సుధాకర్, అతడి అనుచరుడు ఈ విషయాలు చెప్పడంతో పోలీస్ అధికారులు అవాక్కయ్యారు. మోసంలో తన టార్గెట్ రూ. 30 లక్షలు చెప్పిన నిందితుడు.. ఆ పై నగదును కాశీలోని హుండీలో వేస్తానని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. అనుకున్నట్లే బాధితుడి నుంచి వసూలు చేసిన రూ. 32 లక్షల్లో అతడు రూ. 30 లక్షలను ఉంచుకుని 2 లక్షలను హుండీలో వేసినట్లు విచారణలో వెల్లడైంది. కొంతమొత్తం బిచ్చగాళ్లకు కూడా దానం చేయడం కొసమెరుపు.
అవ్వారు సుధాకర్కు శంషాబాద్కు చెందిన నాగార్జునరెడ్డి అలియాస్ సుధీర్కుమార్ పరిచయమయ్యాడు. ఈ క్రమంలో 5 నెలల కిందట రమణ అనే వ్యక్తి ద్వారా విజయవాడకు చెందిన నండూరి రామ్ ప్రసాద్తో పరిచయం ఏర్పడింది. నాగార్జునరెడ్డి అలియాస్ సుధీర్కుమార్ని కస్టమ్స్ అధికారిగా సుధాకర్ రామ్ ప్రసాద్కు పరిచయం చేశాడు. తనకు ఎయిర్పోర్టులో చాలా దేశాల నుంచి వచ్చేవారు బంగారం తెస్తారని, అధికారులు పట్టుకొని సీజ్ చేసిన బంగారం తక్కువ ధరకే అమ్ముతారని, తనకు వారు తెలుసని మాయమాటలు చెప్పాడు. ఇద్దరు కలిసి రూ. 32 లక్షలకు కిలో బంగారం ఇప్పిస్తామని నమ్మించారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే.. సుధాకర్కు ఇక్కడ గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన అనుభవం ఉండటంతో గత నెల 19న బాధితుడిని శంషాబాద్ డిపార్చర్ ప్రాంగణం వద్దకు తీసుకువెళ్లాడు. రామ్ప్రసాద్ రూ. 32 లక్షలు ఇవ్వడంతో సుధాకర్, నాగార్జునరెడ్డి అక్కడి నుంచి ఉడాయించాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం సుధాకర్, నాగార్జునరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, వారి నుంచి రూ. 25,20, 000 నగదు, 4 తులాల బంగారం సీజ్ చేసినట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి తెలిపారు.