సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా జీహెచ్ఎంసీ ముందుకు సాగుతున్నది. మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నగరంలో బీటీ రోడ్లు, ఫ్లైఓవర్లు, వంతెనలు, అండర్పాస్లు నిర్మిస్తున్నది. హైదరాబాద్ ప్రాముఖ్యాన్ని మరింతగా పెంచేందుకు విశేష కృషి చేస్తున్నది. ఈ క్రమంలో రేతిబౌలి నుంచి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఆరు లైన్లతో షేక్పేట, ఫిలింనగర్ జంక్షన్, ఓయూ కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్ వరకు షేక్పేట ఫ్లైఓవర్ ఇంటర్మిడియట్ రింగ్రోడ్డును నిర్మిస్తున్నది. ఈ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
హైటెక్ సిటీకి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురొనే ప్రజలకు ఈ మధ్యంతర రింగ్ రోడ్ నిర్మాణంతో ఉపశమనం లభించడం ఖాయమన్నారు. రూ.333.55 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 2.8 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయని తెలిపారు. 74 పిల్లర్ల నిర్మాణాల్లో 72 పియర్ క్యాప్స్ పూర్తి చేసినట్లు.. 440 పీఎస్సీ గడ్డర్స్.. 144 కాంపోసిట్ గ్రీడర్స్, 73 స్లాబుల నిర్మాణం పూర్తి అయ్యిందని వెల్లడించారు. ఇప్పటి వరకు 93 శాతం పనులు పూర్తి కాగా డిసెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి నగర వాసులకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ ఉన్న ప్రధాన ఏరియా వాసులకు రవాణా సౌకర్యం మెరుగుపడటం ఖాయమని జీహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు.