జూబ్లీహిల్స్, మే 18: మ్యాన్హోళ్ల పూడికతీత పనుల్లో జలమండలి సీవరేజీ విభాగం సిబ్బందికి ఎట్టకేలకు ఇబ్బందులు తప్పనున్నాయి. పూడికతీత పనుల్లో మానవరహిత సేవలు వినియోగించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేస్తుండటంతో ఆయా పనుల్లో పాల్గొనే సిబ్బంది ఊపిరి పీల్చుకోనున్నారు. డ్రైనేజీ మరమ్మతు పనులు చేపట్టే సీవరేజీ కార్మికులు మ్యాన్హోల్లోకి దిగి ప్రాణాలమీదకు తెచ్చుకున్న సందర్భాలు అక్కడక్కడా చోటుచేసుకున్నా యి. దీనిని తీవ్రంగా పరిగణించిన జలమండలి అధికారులు పూడికతీత పనుల్లో ‘సివర్ గ్రాబర్’ (సిల్ట్ గ్రాబర్) యంత్రంతో పనులు చేపడుతున్నారు. మ్యాన్హోల్లోని మట్టిని, ఇసుకను, రాళ్లతో పాటు ఇతర వ్యర్థాలను ఈ యంత్రాలు సునాయాసంగా బయటకు తీస్తాయి. గతం లో మ్యాన్హోళ్లలో పేరుకుపోతున్న చెత్తాచెదారాన్ని బయటకు తీసేందుకు కార్మికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చే ది. ఎంత లోపలికి ఈ వ్యర్థాలుంటే అంత లోపలికి కార్మికులు వెళ్లాల్సి వచ్చేది. జలమండలి కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ యంత్రాలు ఎంత లోపలికైనా చొచ్చుకుపోయి మ్యాన్హోళ్లను అత్యంత వేగంగా శుభ్రం చేస్తాయి. అంతేకాక సీవరేజీ సిబ్బంది ఈ ప్రమాదకర పనుల జోలికి వెళ్లకుండా సిల్ట్ గ్రాబర్ యంత్రం తన పనిని తాను చేసుకుపోతోంది. మంగళవారం బోరబండ ప్రాంతంలో ‘సివర్ గ్రాబర్’ యంత్రంతో మ్యాన్హోల్ పూడికతీత పనులను విజయవంతంగా చేపట్టారు. జలమండలి డివిజన్-6 జనరల్ మేనేజర్ హరిశంకర్ నేతృత్వంలో డిప్యూటీ జీఎం చిట్టిబాబు పనులను పరిశీలించారు.