జూబ్లీహిల్స్, సెప్టెంబర్ 15 : అన్ని రంగాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. ఉద్యోగ, ఉపాధి లేక అనేక మంది యువతీయువకులు రోడ్డున పడ్డారు. అలాంటి వారికి సెట్విన్ భరోసా కల్పిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర యువజన సర్వీసుల పరిధిలో లక్షలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి కల్పించి బాసటగా నిలిచిన సెట్విన్ తాజాగా కొత్త కోర్సులకు శ్రీకారం చుడుతున్నది. కరోనా సెకెండ్ వేవ్ తరువాత యూసుఫ్గూడ సెట్విన్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో పూర్తి స్థాయిలో శిక్షణ తరగతులు ప్రారంభించి మార్కెట్లో డిమాండ్ మేరకు అదనపు కోర్సులను ప్రవేశపెడుతున్నారు. నగరంలో లక్షలాది రూపాయల వ్యయంతో కూడుకున్న ప్యాషన్ డిజైనింగ్ శిక్షణను పురుషులకు సైతం అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే కంప్యూటర్ విభాగంలో ఎంఎస్ ఆఫీస్, డీటీపీ, అకౌంటింగ్ ప్యాకేజి, సీసీఏ, సీ ++, డీఏపీ డీఈ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు.
మహిళలకు నాలుగు సెమిస్టర్లలో ప్యాషన్ డిజైనింగ్పై శిక్షణ ఇస్తున్నారు. ఇందులో గార్మెంట్ మేకింగ్, టెక్స్టైల్ డిజైనింగ్ తదితర వాటిపై మెలుకువలు నేర్పిస్తున్నారు. పదవ తరగతి అర్హతతో అతి తక్కువ ఫీజుతో స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ అందిస్తూ నిరుద్యోగులకు కొండంత అండగా నిలుస్తున్నారు.