ఎల్బీనగర్, మే 15 : లాక్డౌన్ నేపథ్యంలో నాగోలు ఇన్నర్ రింగ్రోడ్డులో సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. గత ఏడాది లాక్డౌన్ సమయంలోనే నాగోలు బ్రిడ్జి మొదలుకుని ఆర్టీఏ కార్యాలయం వరకు రోడ్డు పనులు చేపట్టిన అధికారులు తాజాగా ఆ పనులు పూర్తి కావడంతో సర్వీస్ రోడ్డును పునరుద్ధరించే పనులు చేపడుతున్నారు. ప్రధానంగా నాగోలు బ్రిడ్జి నుంచి ఆర్టీఏ కార్యాలయం వరకు భవనాలను తొలగించిన అనంతరం మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ పైపులేన్ను రోడ్డు పక్కకు మార్చే పనులు నిర్వహించారు. ఈ పనులన్నీ పూర్తి కావడంతో తాజాగా సర్వీసు రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే వాహనదారులకు మేలు జరుగనుంది. అదే విధంగా నాగోలు పెట్రోల్ బంక్ నుంచి బండ్లగూడ వెళ్లే దారిలో మహంకాళి ఆలయం వరకు కూడా రోడ్డును వెడల్పు చేసి, సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. లాక్డౌన్తో రాకపోకలు ఆగిపోయిన నేపథ్యంలో పనులు వేగంగా చేసేందుకు అవకాశం ఉన్నది. దీంతో సంబంధిత అధికారులు పనులపై దృష్టి సారించి వేగంగా చేస్తున్నారు. నాగోలు ఫ్లై ఓవర్ నిర్మాణం నేపథ్యంలో ఇక్కడ రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు.