ఘట్కేసర్ : మున్సిపాలిటీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల బడ్జెట్ సమావేశాలను బుధవారం నిర్వహించారు. మేడ్చల్ అదనపు కలెక్టర్ జాన్శ్యాంసన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశాలకు చైర్మన్లు పావనీజంగయ్య యాదవ్, కొండల్రెడ్డి అధ్యక్షత వహించారు.
పోచారం మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రూ.30.89 కోట్ల బడ్జెట్ను పాలకవర్గం సభ్యులు ఆమోదించారు. రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, తాగునీటి సరఫ రా, పారిశుధ్యం, పచ్చదనం, నర్సరీల పెంపకం, హరితహారం, వైకుంఠధామాలు, సమీకృత మార్కెట్ల అభివృద్ధికి ఈ సమావేశంలో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.
ఘట్కేసర్ మున్సిపాలిటీలో రూ.24.29 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే సమీకృత మార్కెట్ అభివృద్ధి, ప్రజల మౌలిక సదుపాయాలు, వైకుంఠధామాలు, తాగునీరు, రోడ్లు, పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేందుకు ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేశ్కుమార్, వసంత, మేనేజర్లు టి.నర్సింహులు, శ్రీధర్రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత స్థానిక కాలనీ అసోసియేషన్లకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మేడ్చల్ అదనపు కలెక్టర్ జాన్శ్యాంసన్ తెలిపారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బడ్జెట్పై సర్వసభ్య సమావేశాన్ని బుధవారం మేయర్ జక్క వెంకట్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. సుమారు రూ.80 కోట్లతో వార్షిక బడ్జెట్ కేటాయించి, ఎల్ఆర్ఎస్ నిధులు, వివిధ రకాల పన్నులు, ప్రభుత్వ నిధులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆరు చోట్ల స్ట్రీట్ వెండర్స్, మౌలిక వసతుల కల్పనకు, వైకుంఠధామాల అభివృద్ధితో పాటు పలు రకాల పనులకు బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్గౌడ్, కార్పొరేటర్లు, కమిషనర్ బి.శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బోడుప్పల్లో నగరపాలక సంస్థ కార్యాలయంలో నూ తన బడ్జెట్పై మేయర్ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జాన్శ్యాంసన్ హాజరై జమా ఖర్చులు, గ్రాంట్లు మొదలైనవి సభ్యుల ఎదుట బడ్జెట్ నివేదికను చదవి వివరించారు. సమావేశంలో ఆయా డివిజన్ కార్పొరేటర్లు 2021-22 సంవత్సరానికి గానూ పలు అభివృద్ధి పనులకు కేటాయించిన బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి రూ.84 కోట్ల నిధులను కేటాయించినట్లు అదనపు కలెక్టర్ జాన్శ్యాంసన్ తెలిపారు. సమావేశంలో కమిషనర్ బి.శ్రీనివాస్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.