హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సర్టిఫికెట్ ఇకపై జీవితకాలంపాటు చెల్లుబాటు అవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ గురువారం వెల్లడించారు. ఇదివరకు ఏడేండ్లుగా ఉన్న ఈ గడువును పెంచుతున్నట్టు ప్రకటించారు. 2011 నుంచే ఇది అమలవుతుందని తెలిపారు. కేంద్రం తాజా ప్రకటనతో రాష్ట్రంలో దాదాపు ఏడువేల టీచర్ల పోస్టుల భర్తీకి లైన్క్లియర్ అయ్యింది. టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీపై స్పష్టత లేకపోవడంతో ఇంతకాలం టీచర్ల నియామకాలు నిలిచిపోయాయి. టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీని జీవితకాలానికి పొడగించడంతో రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది అభ్యర్థులకు ఊరట లభించనున్నది. 2011 జూలై 1న, 2012 జనవరి 8న, 2012 జూన్1న టెట్లను నిర్వహించగా, ఈ మూడింటిలో అర్హత సాధించినవారి ఏడేండ్ల వ్యవధి ముగిసింది. వీరి సంఖ్య 2 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. తాజా నిర్ణయంతో వీరికి గతంలో సాధించిన టెట్ స్కోర్ వర్తిస్తుంది. 2014 మార్చి 16న నిర్వహించిన టెట్లో 1.6 లక్షల మంది అర్హత సాధించగా, వీరి వ్యాలిడిటీ ఈ ఏడాదితో ముగిసింది. జీవితకాలం పొడగింపుతో వీరు చివరి నిమిషంలో అదృష్టం దక్కించుకున్నట్లయ్యింది. 2016 మే 22న, 2017 జూలై 23న నిర్వహించిన టెట్లో 2.1 లక్షల మంది అర్హత సాధించగా, ఇక వీరి స్కోర్ శాశ్వతం కానున్నది.
ఇప్పటివరకు టెట్ పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించారు. ఇకనుంచి ఆన్లైన్లో నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా టెట్ను నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు ఉపాధ్యాయ నియామకాలకు టెట్ తప్పనిసరి. దీంతో టెట్ రాసే వారి సంఖ్య గణనీయంగా పెరగనున్నది. అయితే టెట్, డీఎస్సీ కలిపి నిర్వహించాలన్న ప్రతిపాదనను తెలంగాణ విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతానికి టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ పొడగించినా మెమోలు అందుబాటులో లేవు. 2011, 2012లలో రెండు టెట్లు రాసిన వారికి మాత్రమే పోస్టు ద్వారా మెమోలు జారీచేశారు. మిగతా టెట్లకు హాజరైనవారికి ఇంటర్నెట్ మెమోలనే ఇచ్చారు. ఈ వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులు వెబ్సైట్ నుంచి తొలగించారు. దీంతో తాజాగా గడువు పొడగించిన వారికి టెట్ సర్టిఫికెట్లు పొందడం ఇబ్బందిగా పరిణమించనున్నది. ఇప్పటికే పలు ఉద్యోగాలు పొందినవారు టెట్ మెమోల కోసం ఎన్సీఈఆర్టీలోని టీఎస్ టెట్ కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారు. తమ వద్ద లేవని అధికారులు చెబుతుండటంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. వ్యాలిడిటీ పొడిగించిన నేపథ్యంలో మెమోలను వెబ్సైట్లో పొందుపరచాలని అభ్యర్థులు కోరుతున్నారు. కాగా, ఇప్పటికే ఏడేళ్లు పూర్తయిన అభ్యర్థుల సర్టిఫికెట్లను రెన్యువల్ చేయడానికి లేదా కొత్తవి జారీచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు.