సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): నగరంలో నేటి నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలకు కొవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి బల్దియా పరిధిలోని ఎస్హెచ్జీ మహిళలకు వ్యాక్సిన్ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎస్హెచ్జీ మహిళలకు వ్యాక్సిన్ను ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం, నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా నేడు 32,150 మందికి వ్యాక్సిన్ను ఇచ్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. దీంతో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 5,46,071 మందికి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం పూర్తయిందని వారు పేర్కొన్నారు. అలాగే, కరోనా నేపథ్యంలో పేదలకు ఉచితంగా అందిస్తోన్న అన్నపూర్ణ భోజన పథకంలో భాగంగా నేడు 71,120 మందికి ఉచిత భోజనాలను జీహెచ్ఎంసీ అందించింది. మొత్తం 21,93,695 మందికి ఇప్పటి వరకు ఉచిత భోజనాన్ని జీహెచ్ఎంసీ అందించింది.