హైదరాబాద్ సిటీబ్యూరో/మహేశ్వరం, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆమె శనివారం మహేశ్వరం మండల కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహేశ్వరంలో రూ.69 లక్షలతో మార్కెట్ షెడ్డు, రూ.4.20 కోట్లతో గిరిజన వసతి గృహం, రూ.5 కోట్లతో సంక్షేమ బాలుర పాఠశాలను ప్రారంభించారు. అనంతరం సేవాలాల్ ఆలయం, కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి సత్యవతి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలో 24 కులాలకు ఆత్మగౌరవ భవనాలను రూ.15 కోట్లతో మంత్రి సబిత నిర్మించారని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గానికి ఎనలేని సేవలందిస్తున్న సబితారెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. అనంతరం ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ల హామీలకు గ్యారెంటీ లేదన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.