సిటీబ్యూరో, జూలై 14(నమస్తే తెలంగాణ): పోలీసులు సీజ్ చేసిన వాహనాలకు మంచి గిరాకీ వచ్చింది. మంగళ, బుధవారం రెండు రోజులు 2548 వాహనాలను వేలం వేయగా అంచనాలకు మించి రూ. 1.44 కోట్ల ఆదాయం వచ్చినట్లు హైదరాబాద్ సిటీ పోలీసు వాహనాల వేలం కమిటీ చైర్మన్, నగర అదనపు పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో 12వ దఫా వాహనాల వేలం కార్యక్రమాన్ని గోషామహల్లోని శివకుమార్లాల్ పోలీసు స్టేడియంలో నిర్వహించారు. ఈ వేలంలో 2404 ద్విచక్ర వాహనాలు, 59 మూడు చక్రాలు, 12 నాలుగు చక్రాల వాహనాలను వేలం వేసినట్టు పేర్కొన్నారు. ఈ వేలానికి భారీ స్పందన వచ్చిందని, అన్ని వాహనాలపై రూ. 54,53,500 రిజర్వు చేయగా, అంచనాలకు మించి రూ.1,44,26,500లు వచ్చాయని వివరించారు. ఈ సందర్భంగా వేలం కమిటీని సీపీ అంజనీకుమార్ అభినందించారని, తర్వాత దఫా వేలానికి కూడా సన్నద్ధం కావాలని సూచించారని అదనపు సీపీ పేర్కొన్నారు.