వ్యవసాయ యూనివర్సిటీ : రాష్ర్టానికి కావాల్సిన కూరగాయలు రైతులు పండించే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డా. నీరజా ప్రభాకర్ అన్నారు. సోమవారం రిజిస్ట్రార్ డా. ఏ.భగవాన్తో కలిసి రాజేంద్రనగర్ సమీపంలోని కూరగాయల పరిశోధనా సంస్థను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంతోపాటు ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నదని గుర్తుచేశారు. నాలుగేండ్ల కిందటి వరకు ఇతర రాష్ర్టాలనుంచి కూరగాయలు దిగుమతి చేసుకునేవారని తెలిపారు. ఇప్పుడిప్పుడే రైతులు కూరగాయల సాగు వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. కూరగాయల సాగుకు ఇక్కడి వాతావరణం, నేలల స్వభావం అనుకూలంగా ఉందన్నారు. ఉద్యానశాస్త్రవేత్తల కృషి మరింత అవసరమని సూచించారు. అనంతరం పరిశోధన సంస్థానం వివిధ ఈ స్కీమ్స్ లలో జరుగుతున్న పరిశోధనలను, వెజిటేబుల్ ఫారం వద్ద పరిశీలించి తగు సూచనలు, సలహాలు చేశారు. కూరగాయల విత్తనోత్పత్తిని అధిక మొత్తంలో చేయాలని రక్షిత కూరగాయల సాగు, యాజమాన్య పద్ధతులను ఆధునిక శాస్త్ర సాంకేతికతను ఉపయోగించి పంటల సాగును చేయాలని శాస్త్రవేత్తలకు సూచించారు. కూరగాయల పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్త హెడ్ డా. ఎం హనుమాన్ నాయక్, సీనియర్ శాస్త్రవేత్త డా. డి. అనీతాకుమారి, శాస్తవేత్త హెచ్. వీర సురేశ్, సూపరింటెండెంట్ ఎం. రజినీకాంత్, ఏఈఓ పి. యాదయ్య తగు సూచనలు చేశారు.