కంటోన్మెంట్, జూన్ 22: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బీజేపీలో వర్గపోరు ముదిరి పాకానపడుతున్నది. నేతలు, పార్టీ కార్యకర్తలు మూడువర్గాలుగా విడిపోయి, ఎవరికి వారుగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడంతోనే కాలం గడుపుతున్నారు. రాష్ట్రంలో మేమే సెకండ్ ప్లేస్ అని కా షాయం నేతలు మాటలతో కోటలు కడుతున్నారు. కానీ కంటోన్మెంట్లో పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య సయోధ్యను సాధించడంలోవిఫలమవుతున్నారు. మూడు గ్రూపులుగా నేతలు చెలరేగుతుండడం వారికి చేటు చేస్తోంది. జాతీయ స్థాయిలో ప్రధాన భూమిక పోషిస్తున్న బీజేపీ తెలంగాణలోనూ పాగా వేయాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగానే పార్టీలోకి వచ్చే ప్రతిఒక్కరినీ ఆహ్వానిస్తుంది. దీంతో ‘మూడు గ్రూపులు.. ఆరు వర్గాలు’గా తయారైంది. పార్టీ నాయకుల మధ్య సమన్వయం, సఖ్యత లేదు.
కనీసం కంటోన్మెంట్లో పార్టీ అనేది ఒకటుందని కూడా కనిపించడం లేదు. ఎవరికి వారు రాజకీయంగా కాషాయం కండువా మెడలో కప్పుకుంటూ వ్యక్తిగతంగా తమ ఉనికిని చాటు కోవడానికి తాపత్రయ పడుతున్నారే తప్ప పార్టీ కోసం ఎవరూ ఆలోచించడం లేదు. ఈ క్రమంలో పార్టీ కేడర్ దిక్కుతోచని స్థితిలో పడింది. ఎవరి వెంట నడుస్తే ఏం జరుగుతుందో అన్న మీమాంసలో పడిపోతున్నారు.
కంటోన్మెంట్లోని పార్టీ పరిస్థితిపై బీజేపీ అధిష్టానం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. దీంతో పాటు ఈ నెల 12న నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. దీనికి రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీలు మంత్రి శ్రీనివాస్, దుగ్యాల ప్రదీప్కుమార్ పాల్గొని పార్టీ పటిష్టతకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అయితే నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు అందరూ పాల్గొన్నప్పటికీ బీజేపీ నేత జంపన ప్రతాప్ గైర్హాజరయ్యారు. సమావేశానికి రాకపోవడంపై బీజేపీ పెద్ద లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీతో కలిసి తిరగడంపైనా నివేదికలు రావడంతో ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీ అధిష్టానం నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.