సికింద్రాబాద్ సమీపంలోని కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయడం చాలా మేలని జనం ముక్తకంఠంతో మద్దతు తెలిపారు. బోర్డు విలీన ప్రతిపాదనపై పురపాలక మంత్రి కేటీఆర్ బుధవారం ట్విట్టర్లో ప్రజాభిప్రాయం కోరగా..నిమిషాల్లోనే నెటిజన్లు స్పందించి విలీనానికి జైకొట్టారు. రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న బోర్డు ఆంక్షల నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని అభిప్రాయ పడ్డారు. వాస్తవానికి కంటోన్మెంట్ విలీన ప్రతిపాదన పాతదే అయినప్పటికీ ఈ ప్రక్రియ తరచూ వాయిదా పడుతూ వస్తున్నది.
ఫలితంగా బోర్డు పరిధిలో నివాసితులకు రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఫలాలు దక్కడం లేదు. రెండంతస్తుల నిర్మాణాలకే పరిమితమైనా అనుమతి కావాలంటే ఏడాది ఆగాలి. రిజిస్ట్రేషన్ చార్జీలు అధికం. ఇక్కడ తాగునీరు, మురుగునీటి నిర్వహణ అస్తవ్యస్తం. అన్నింటికి మించి ప్రధాన సమస్య రహదారుల మూసివేత. నగరం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల రాకపోకలకు కంటోన్మెంట్ ప్రధాన మార్గం. తరచూ రహదారులను మూసివేస్తుండడంతో వాహనదారుల అవస్థలు చెప్పజాలనివి. దీనిపై పలుమార్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖలు రాసినా ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన పోలేదు.
సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి కండ్లకోయ ఔటర్ వరకు 18.50 కి.మీ.డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, జింఖానా నుంచి తూంకుంట వరకు 18.40 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రధాన సమస్య భూసేకరణ. రక్షణ శాఖకు సంబంధించి దాదాపు 90 ఎకరాల వరకు సేకరించాలి. ఈ రెండు స్కై వేల నిర్మాణానికి భూ బదలాయింపు కింద రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు సుమారు 550 ఎకరాలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నా కేంద్రం నుంచి స్పందన కరువైంది. కంటోన్మెంట్.. ఓ చారిత్రక ప్రాంతం.. రక్షణ స్థావరం.భాగ్యనగరంలో కలిసిపోయినట్టే కనిపించినా పాలన మాత్రం ప్రత్యేకం. నగర పాలక సంస్థకు ఈ ప్రాంతంపై ఎలాంటి అధికారమూ లేదు.
అన్నింటి కంటే అభివృద్ధి పనులకు అడుగడుగునా ఆటంకాలు.. వెరసి హైదరాబాద్కు నడిబొడ్డున ఉన్నా.. అభివృద్ధికి ఆమడదూరమే. కంటోన్మెంట్ బోర్డులో బడ్జెట్ లేక రోజుకో సమస్య ఉత్పన్నమవుతుంది. ప్రజల నుంచి ప్రభుత్వానికి వస్తున్న విజ్ఞప్తుల మేరకు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు బుధవారం జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీన ప్రతిపాదనపై ట్విట్టర్ వేదికగా ప్రజాభిప్రాయ సేకరణ కోరారు. ఇందుకు పౌరులు భారీ స్థాయిలో విలీనానికి ముక్తకంఠంతో జై కొట్టారు. ఆంక్షల వలయం నుంచి విముక్తి కల్పించి సంక్షేమ ఫలాలు మాకూ దక్కాలె అనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం ప్రతిపాదన ఇప్పటిది కాదు. చాలా కాలంగా తెరపైకొస్తూ ఆపై స్తబ్దత నెలకొనడం సాధారణమే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా జరుగుతున్న అభివృద్ధికి రక్షణ భూములు అడ్డంకిగా మారాయి. రక్షణ శాఖ అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. మహానగరం నడిబొడ్డున విస్తరించిన కంటోన్మెంటు బోర్డులో రహదారుల మూసివేత సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీల ప్రత్యేక చొరవతో తాత్కాలికంగా ఉపశమనం లభించినా.. శాశ్వత పరిష్కారం మాత్రం లభించలేదు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనమైతే అన్ని సమస్యలు తీరుతాయని ప్రజలు కోరుతున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాత్రమే కాదు… దేశవ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డులను ఆయా స్థానిక సంస్థల్లో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే కసరత్తు చేసింది. తాజాగా ఈ ఏడాది తొలినాళ్లలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి కూడా జీహెచ్ఎంసీలో బోర్డు విలీనంపై రక్షణ శాఖకు లేఖ రాసినట్లు తెలిసింది. కానీ కేంద్రం నుంచి స్పందన రాలేదు.
కంటోన్మెంట్ బోర్డు ఏటా బడ్జెట్ రూ.200 కోట్లు. బోర్డులో ఉండే జనావాసాల్లోని జనాభా అవసరాలు, వసతుల కల్పనకు ఇవి ఏమూలకూ సరిపోవు. బోర్డు పరిధిలో పని చేసే 473 మంది సిబ్బందికీ సరిగ్గా జీతాలు ఇవ్వలేని దుస్థితి. సర్వీసు ఛార్జీల కింద రూ.650 కోట్ల మేర రావాల్సిన బకాయిలపైనా కేంద్ర సర్కారు స్పందించడం లేదు. భూములు, గృహ రిజిస్ట్రేషన్లకు సంబంధించి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఫీజుల కంటే 3.5 శాతం అధికం. ఇలా నెలకు వచ్చే రూ.10 కోట్లే ఇప్పుడు బోర్డుకు శరణ్యంగా మారింది.
సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతం మీదుగా రాజీవ్ రహదారి కరీంనగర్, నాగ్పూర్హైవే నిజామాబాద్ వరకు వెళ్లడం ఎంత కష్టమో ఆ మార్గంలో ప్రయాణించే వారికి ఎవరికైనా తెలుసు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ కండ్లకోయ, జింఖానా నుంచి శామీర్పేట ఓఆర్ఆర్ వరకు వెళ్లాలంటే సగటు వాహనదారుడి ఓపికకు పరీక్షలాంటిదే. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ కండ్లకోయ ఔటర్ రింగు రోడ్డు వరకు 18.50 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్, జింఖానా నుంచి తూంకుంట వరకు 18.400కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్టు భూసేకరణలో భాగంగా రక్షణ శాఖకు సంబంధించి దాదాపు 90 ఎకరాల మేర సేకరించాల్సి ఉంది.
భూ బదలాయింపు కింద రక్షణ శాఖకు సుమారు 550 ఎకరాలు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పలుమార్లు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు కేంద్రానికి విజ్ఞప్తులు చేశారు. అయినా నేటికీ కేంద్రం నుంచి స్పందన కరువైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా రాష్ట్రం నుంచి వినతులు వెళ్లినా ఫలితం శూన్యం. ఈ నేపథ్యంలోనే కంటోన్మెంట్ జీహెచ్ఎంసీ పరిధిలో విలీనం ఐతే ఈ ప్రాజెక్టులు అమలు మార్గం సుగమం అయినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా బొల్లారం పరిధిలో దాదాపు 30 ఎకరాల మేర మాత్రమే ఎస్టేట్ ల్యాండ్ తప్ప మిగిలిన ప్రాంతా ల్లో సివిల్ ల్యాండ్ భూ సేకరణకు ఈజీగా ఉంటుందని చెబుతున్నారు.
నాగ్పూర్లో 38.21 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టును రూ. 8,600 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. దేశంలోనే వినూత్నంగా ఒకే స్తంభానికి డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ను నిర్మించారు. ఒక దానిపై మరోటి వస్తుంది. మొదటి ఫ్లై ఓవర్లో వాహనాల రాకపోకలకు, రెండో ఫ్లై ఓవర్లో మెట్రో రైలు ప్రయాణించేలా నిర్మించారు. ఇదే తరహాలో నగరం నుంచి నిజామాబాద్ హైవే, రాజీవ్ రహదారికి సులువుగా చేరేందుకుగానూ రెండు చోట్ల డబుల్ డెక్కర్ నిర్మాణానికి సర్కారు ప్రతిపాదనలు చేపట్టాలని హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తున్నారు.కానీ రక్షణ శాఖ పరిధిలో భూముల సేకరణే ప్రధాన సమస్యగా మారుతోంది. కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనమైతే ఈ భూసేకరణ సులభతరమవుతుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారిక బాధ్యతలు ఐఏఎస్ అధికారి కమిషనర్ హోదాలో నిర్వహిస్తుండగా..కంటోన్మెంట్ బోర్డులో ఈ బాధ్యతలను ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అధికారి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి హోదాలో నిర్వర్తిస్తారు. మిలిటరీ దవాఖానలో ఆర్ఎంవోగా విధులు నిర్వర్తించే మిలటరీ అధికారి, బోర్డు హెల్త్ అధికారిగా వ్యవహరిస్తారు. కాగా బోర్డు, హెల్త్, శానిటరీ, వాటర్, పన్ను విభాగాల పనితీరును సూపరింటెండెంట్ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తుంటారు.
ఇంజనీరింగ్ విభాగంలో ఆరుగురు ఇంజనీర్లుండగా, ఇద్దరు జూనియర్ ఇంజనీర్లు (జేఈ-1, జేఈ-2)లు ఉంటారు. స్వయం ప్రతిపత్తిన కొనసాగే బోర్డుకు అక్ట్రాయ్ టోల్ ట్యాక్స్, ఆస్తిపన్ను, వాణిజ్య పన్ను, రిజిస్ట్రేషన్లు, ట్రేడ్ లైసెన్స్లు, హోర్డింగ్ల అనుమతుల ద్వారా వచ్చే ఆదాయంతోనే సిబ్బంది జీతభత్యాలు, అభివృద్ధి పనులను చేపడుతుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో పనులను చేపట్టడానికి బోర్డు సీఈవోకు రూ.50వేల వరకూ చెక్పవర్ ఉంటుంది.
సిటీబ్యూరో, సెప్టెంబరు 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే.టీ.రామారావు ట్విట్టర్ వేదికగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనంపై ఆసక్తికర చర్చ పెట్టారు. ‘కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి నేను అంగీకరిస్తున్నాను. మీరు ఏమంటారు నగరవాసులారా..?’ అంటూ ప్రశ్నించారు. మీ నిర్ణయం చాలా చాలా మంచిదని, మేమంతా అంగీకరిస్తున్నామని వేలాది మంది ట్విట్టర్లో ప్రతిస్పందించారు. మంత్రి చేసిన ట్వీట్ను 3వేల మందికిపైగా లైక్ చేయగా, 300మంది రీట్వీట్ చేశారు. అదేవిధంగా వంద మందిపైగా సమస్య తీవ్రతను పేర్కొంటూ పలు అంశాలను ప్రస్తావించారు.
కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కృషి చేస్తాను. మంత్రి కేటీఆర్ ట్వీట్తో ప్రతి ఒక్కరూ ఇందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉండడం కారణంగా అభివృద్ధి కుంటుపడుతోంది. ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రి కేటీఆర్ రూపొందించే కార్యాచరణ మేరకు నడుచుకుంటాం.- జి. సాయన్న, ఎమ్మెల్యే, కంటోన్మెంట్
కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రతి అంశంపై కేంద్రం వివక్ష చూపుతుంది. రోడ్ల విస్తరణ, ప్రజా ప్రయోజనాలకు రక్షణ శాఖ పరిధిలోని భూములను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. వీటన్నింటికీ పరిష్కారం కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడమే ఉత్తమం. – జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు
కంటోన్మెంట్లో కేంద్ర ప్రభుత్వ దవాఖానలు రెండే ఉన్నాయి. జీహెచ్ఎంసీలో ప్రతీ బస్తీలో దవాఖాన ఉన్నది. ఇక్కడ రోడ్ల మరమ్మతు సరిగ్గా ఉండదు. జీహెచ్ఎంసీలో ఫోన్తో పనైపోతుంది. ఇలా అనేక అంశాల్లో కంటోన్మెంట్ పేదలకు మేలు జరుగుతుంది. మంత్రి కేటీఆర్ ఆలోచన మేరకు జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ను విలీనమే ఉత్తమం. – డాక్టర్ శంకర్రావు, రిసాలబజార్, బొల్లారం
కంటోన్మెంట్లో అంగన్వాడీలు లేవు. మహిళా గ్రూపులు చాలా తక్కువ. వరద నీరు వస్తే కాలనీలన్నీ జలమయమవుతాయి. సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ ఏదీ సరిగా ఉండదు. పన్ను మాత్రం జీహెచ్ఎంసీ కంటే ఎక్కువగా వసూలు చేస్తారు. ప్రజలకు మౌలిక వసతులు లేకున్నా బోర్డు అధికారులు పట్టించుకోరు. కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. – ఈఆర్ బాల్రాజు, ఆదర్శనగర్, బొల్లారం.
దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఓటరు జాబితానే వినియోగిస్తారు. స్థానిక సంస్థల నుంచి చట్టసభల ఎన్నికల వరకూ ఇదే జాబితాను ఉపయోగిస్తారు. కంటోన్మెంట్లో జరిగే ఎన్నికలకు మాత్రం ఈ జాబితా పనికి రాదు. బోర్డు సొంతంగా ఓటరు జాబితాను సిద్ధం చేస్తుంది. కంటోన్మెంట్ ఎలక్టోరల్ రూల్ -2007 ప్రకారం ఈ జాబితాను తయారు చేస్తారు. ఈ జాబితాలో పేరు నమోదు చేసుకుంటేనే బోర్డు ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హులవుతారు. ఒకవేళ విలీనమైతే జీహెచ్ఎంసీ మాదిరిగానే సాధారణంగానే ఉంటుంది.
కంటోన్మెంట్ ప్రాంతం కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉండడంతో అభివృద్ధి జరగడం లేదు. కనీస సౌకర్యాలైన తాగునీరు, రోడ్లు, పారిశుధ్య సమస్యలు పరిష్కారం కావడం లేదు. జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే నగర నడిబొడ్డున ఉన్న కంటోన్మెంట్ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తుంది. – ఎన్. సునీత, వాసవీనగర్, కంటోన్మెంట్
కంటోన్మెంట్ ప్రాంతంలో నల్లా బిల్లులు అధికంగా వస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పక్క కాలనీలో రాష్ట్ర ప్రభుత్వ ఉచిత నీటి సరఫరా చేస్తుంది. మేము నల్లా బిల్లులు కట్టినప్పటికీ మూడు, నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. నీళ్లు సరిగా రాని నల్లాలకు బిల్లులు భరించలేం. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే మా సమస్యలన్నీ తీరుతాయి. – సాయికుమార్, పికెట్, కంటోన్మెంట్
కంటోన్మెంట్ కేంద్ర రక్షణ ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టాలన్నా రక్షణ శాఖ ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాలకూ అదే పరిస్థితి. దీంతో ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్లు, మెట్రో రైలు పొడగింపు, స్కైవేల నిర్మాణం వంటివి చేపట్టడం కష్టంగా మారింది. రక్షణ శాఖ పెత్తనం లేకుండా ఈ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది. – హరి, మారేడ్పల్లి, కంటోన్మెంట్
రక్షణ శాఖ అధికారులు కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో రోడ్లను మూసి వేసినప్పుడు ఈ ప్రాంత ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వ్యక్తి తన ఇంటికి వెళ్లాలన్నా కనీసం 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్లను తెరిపించేది. – శ్రీనివాస్రెడ్డి, మహాత్మానగర్, కంటోన్మెంట్
మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను ఈ ప్రాంత ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ ప్రాంతం జీహెచ్ఎంసీలో విలీనమైతే నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఇక్కడి ఖాళీ స్థలాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వస్తే డబుల్బెడ్ రూం ఇండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, అభివృద్ధి పనులను చేపట్టవచ్చు.- ఎబెల్, కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్షులు, బోయిన్పల్లి
కంటోన్మెంట్ ప్రాంతం ఇన్నాళ్లుగా కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉంది. అయినా ఈ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఒక్కటీ రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాత్రమే మాకు అంతో ఇంతో ఆసరా అవుతున్నాయి. – ప్రభాకర్, తిరుమలగిరి, కంటోన్మెంట్