కంటోన్మెంట్, మార్చి 15 : కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవిపై ఎన్నో ఆశ లు పెట్టుకుని కండువాలు సైతం మార్చిన ఆ నేతలకు మరోసారి చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఎంతో హాడావుడిగా కమలం గూటికి చేరిన వారికి బీజేపీ పెద్దలు చెవి లో పూలు పెట్టినట్లు సమాచారం. బోర్డు పరిధిలో పార్టీని పటిష్టం చేస్తామని చెప్పి, కండువాలు కప్పుకున్నా ఆ ముగ్గురి నేతల ఆలోచనలు ముందే పసిగట్టిన కమలం నేతలు వారి పాచికలు పారకుండా కట్టడి చేశారు. ఇంతకీ ఆ ముగ్గురు కాషాయం కప్పుకున్న నేతలు ఎవరో ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉంటుంది. అవును మీరు ఊహించింది నిజమే.. వారే కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, జే. రామకృష్ణ, భానుకా నర్మదామల్లికార్జున్లు. సరిగ్గా రెండు నెలల్లో కంటోన్మెంట్ బోర్డు వెరీడ్ బోర్డుగా మారుతున్న సందర్భంలో ఈ ముగ్గురు నేతలు కాషాయం గూటికి చేరారు. ఎట్టి పరిస్థితుల్లో బోర్డు నామినేటెడ్ పదవి దక్కించుకోవాలనే పట్టుదలతో ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. బీజేపీ పెద్దలు ఆశీస్సులు తీసుకోవడానికి పలుమార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టారు. కానీ స్థానిక నాయకత్వంతో పాటు రాష్ట్ర పెద్దలు వీరి కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు నేతలు కాషాయం కండువా కప్పుకున్న నాటి నుంచి బాహటంగానే విమర్శలు గుప్పించుకున్నప్పటికీ, బీజేపీ అధిష్టానం వీరిని పరిగణలోకి తీసుకోకపోవడంతో ఇక చేసేదేమీ లేక మాజీలు ఐక్యతారాగం పాడేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది.
తమలో ఏ ఒక్కరికి నామినేటెడ్ పదవి దక్కినా సంతోషమే అంటూ ఈ ముగ్గురు మాజీలు ఐక్యతారాగం పాడేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. గత రెండు రోజుల క్రితం ఈ ముగ్గురు నేతలు కంటోన్మెంట్లోని ఓ రహస్య ప్రదేశంలో మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతుంది. తమలో తాము పోట్లాడుకుంటే ఇతరులకు నామినేటెడ్ పదవి వెళ్లే అవకాశం ఉన్నందున ఏకాభిప్రాయానికి రావాలనే ఉద్దేశంతో భేటీ అయినట్లు తెలు స్తోంది. ఈ మధ్య కాలంలోనే బీజేపీ అధిష్టానం సైతం ఎవరి వార్డు పరిధిలో వాళ్లే పరిస్థితులు చక్కబెట్టుకోవాలని, ఇతరుల వార్డులోకి వెళ్లి కొత్త సమస్యలు తీసుకురావొద్దని గట్టిగా మందలించినట్లు బీజేపీ శ్రేణులు బాహటంగానే చెప్పుకుంటున్నారు. ఒకవేళ ముగ్గురిలో ఎవరకి నామినేటెడ్ పదవి రాకుంటే పరిస్థితి ఏంటన్నది కూడా వీరి భేటీలో వచ్చింది. అయితే ఇప్పుడే ఆ చర్చ వద్దని పదవిని ఖరారు చేసి న తరువాత ఆలోచిద్దామని ఓ మాజీ ఉపాధ్యక్షుడు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవికి 21మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రముఖంగా మాజీ మంత్రి విజయరామారావు, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, రామకృష్ణ, భానుకా నర్మదామల్లికార్జున్తో పాటు టీఆర్ఎస్ నుంచి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, సామాజిక కార్యకర్త సతీశ్గు ప్తా, కార్ఖానాకు చెందిన వ్యాపారవేత్త సుభాశ్ అగర్వాల్తో సహా పలువురు ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు ఉన్నా రు. దరఖాస్తు చేసుకున్న 21మంది పేర్లను పుణేలోని సదరన్ కమాండ్కు బోర్డు అధ్యక్షుడు ఇప్పటికే పంపించినట్లు తెలుస్తోంది. అనంతరం సదరన్ కమాండ్ నుంచి డీజీడీఈకి ముగ్గురు పేర్లను ప్రతిపాదించనున్నారు. దీంతో ఈ నెల చివరాఖరుకు నామినేటెడ్ పదవి ఎవరికి వరిస్తుందో తేలనుంది.
బోర్డు నామినేటెడ్ పదవి రేసులో ఇద్దరు నేతలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో ఒకరు ఎవరూ ఊహించని యువనాయకుడు ఉండడం గమనార్హం. ఇప్పటికే ఆ యువనేత రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి వారం పాటు మకాం వేశాడు. కేంద్ర మంత్రుల వద్ద తన ప్రతిపాదనను ముందు పెట్టడంతో పాటు పూర్తిస్థాయిలో లాబీయింగ్ చేయడం జరిగింది. బీజేపీకి సంబందం లేకపోయినా ఆ యువనేతకు ఆర్ఎస్ఎస్ మద్దతుతో పాటు పలువురు కేంద్ర మంత్రుల వద్ద సానిహిత్యం ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లో నామినేటెడ్ పదవి దక్కించుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో కేంద్ర పెద్దల సూచనతో నామినేటెడ్ పదవికి సంబంధించి తనకు అవకాశం కల్పించాలంటూ కోరుతూ కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా మాజీ మంత్రికి రాష్ట్ర బీజేపీ నాయకత్వం నుంచి సహకారం లభిస్తోంది. బోర్డుకు నామినేటెడ్ పదవిని మాజీమంత్రికి ఇవ్వాలని గతంలోనే సూచనాప్రాయంగా అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల క్రితం మాజీమంత్రి విజయరామారావు పేరిట దరఖాస్తును సైతం సమర్పించారు. అయితే గత రెండు రోజుల నుంచి కార్ఖానాకు చెందిన వ్యాపారవేత్త సుభాశ్ అగర్వాల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. వ్యాపారవేత్త పేరును తెరపైకి తేవడంలో కూడా ఈ మాజీల వ్యూహాం ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి చివరకు నామినేటెడ్ పదవి ఎవరికి దక్కుతుందో వేచిచూడాల్సిందే…!