మేడ్చల్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇంటి వద్దకు వెళ్లి పాఠపుస్తకాలను అందిస్తున్నారు. నూతనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియను ఇంటివద్దేనే కొనసాగిస్తున్నారు.మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల బృందాలు ఇంటి వద్దకే వెళ్లి పాఠ్యపుస్తకాలు, అడ్మిషన్లను తీసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఉప్పల్ నియోజకవర్గాల్లో 505 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.
ఇందులో 68 వేల 125 మంది విద్యార్థులు చదువుతున్నారు. 80 శాతం మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీని పూర్తి చేశారు. మిగతా విద్యార్థులకు త్వరలోనే పుస్తకాలను అందజేయనున్నారు. ఆన్లైన్లో ప్రతిరోజూ 47.727 మందికి పైగా తరగతులకు హాజరవుతున్నారు. ఆన్లైన్ తరగుతులను వినేలా విద్యార్థులను ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తూ పాఠాలు వినేలా ప్రొత్సహిస్తున్నారు. ప్రైమరీ పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు నుంచి ఆన్లైన్లో తరగతులను నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇంటివద్దకు ఉపాధ్యాయులు వెళ్లి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తూ, పాఠశాలలో చేరే నూతన విద్యార్థుల అడ్మిషన్లను తీసుకుంటున్నారు. ఆన్లైన్లో హాజరుశాతం పెరిగింది. 80 శాతం పుస్తకాల పంపిణీ పూర్తయింది. ఎన్.ఎస్.ఎస్ ప్రసాద్, జిల్లా విద్యాధికారి