రవీంద్రభారతి : ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి పేర్కొన్నారు. సావిత్రిబాయిపూలే మహిళా పౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం, బతుకమ్మ సంబురాల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ సావిత్రిబాయిపూలే గొప్ప సామాజిక ఉద్యమకారిని, మంచి ఆదర్శ ఉపాధ్యాయురాలని ఆమెను ఉపాధ్యాయులు, విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
స్త్రీ విద్యకోసం, సామాజిక అసమానతలు రూపుమాపుట కోసం అనేక పోరాటాలు చేసిన సామాజిక ఉద్యమకారిని అని కొనియాడారు. స్త్రీలు వంటింటికే పరిమితం కాకుండా చదువుకుని సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం గురుకుల పాఠశాలలను నెలకొల్పి వారికి మెరుగైన ,నాణ్యమైన విద్యను అందిస్తున్నారని చెప్పారు.
ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేసి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వాణీదేవిని ఘనంగా సత్కరించారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సావిత్రిబాయిపూలే వ్యవస్థాపక అధ్యక్షురాలు బెల్ల మాధవి, వివిధ జిల్లాలను నుంచి వచ్చిన టీచర్లు పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మ సంబురాలను ఆటాపాటలతో ఘనంగా నిర్వహించారు.