తెలుగు రాష్ర్టాలకు తీరనిలోటు
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కేంద్ర న్యాయ (లెజిస్లేచర్ ) శాఖ కార్యదర్శి, ఇండియన్ లీగల్ సర్వీసెస్ అధికారి డాక్టర్ జి.నారాయణరాజు మృతి తెలుగు రాష్ర్టాలకు తీరని లోటని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ న్యాయ (లెజిస్లేచర్ ) శాఖ ఉన్నతాధికారిగా ఉన్న నారాయణ రాజు తెలంగాణ రాష్ర్టానికి ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయడంలో కేంద్ర మంత్రులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చేవారన్నారు. తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ స్థానాల పెంపునకు అవకాశాలు ఉన్నాయని తన అభిప్రాయాలను కేంద్రానికి గట్టిగా వినిపించిన నారాయణ రాజు కరోనా బారిన పడి మృతి చెందడం బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు కోసం రాజ్యసభ చైర్మన్, భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, రాజ్యసభలో టీఆర్ఎస్ సభా పక్ష నేత కె.కేశవరావుతో, తనతో సమావేశమైన సందర్భంగా నారాయణ రాజు క్రియాశీలక పాత్రను పోషించి కేంద్ర న్యాయ ( లెజిస్లేచర్ ) శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారని వివరించారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.