వెంగళరావునగర్, ఆగస్టు 13: పారిశుధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ అన్నారు. శుక్రవారం శ్రీనగర్ కాలనీలోని నాగార్జునగర్ కమ్యూనిటీహాల్లో పారిశుధ్య కార్మికుల భద్రత కోసం 75 మంది కార్మికులకు రక్షణ కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భాగ్యనగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతిరోజు పారిశుధ్య కార్మికులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు.
వారి భద్రత కోసం కిట్లను అందజేస్తున్నామని అన్నారు. రోడ్లు పరిశుభ్రంగా ఉంచడం, నాలాల్లో పూడికలు తీయడం వంటి విధులు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా ఈ కిట్లను కార్మికులందరూ ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసి కార్మికుల భద్రత కోసం చేతులకు గ్లౌజులు, కాళ్లకు బూట్లు, కరోన బారిన పడకుండా ఉండేందుకు మాస్కులను ఆయన అందజేశారు.
కార్యక్రమంలో సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత, ఎ.ఎం.హెచ్.ఓ భార్గవ నారాయణ, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అప్పూఖాన్, తన్నూఖాన్, మధు యాదవ్, శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.