కేపీహెచ్బీ కాలనీ, మార్చి 16: దేశానికి సేవలందిస్తూ వీరమరణం పొందిన సైనికుల రుణం తీర్చుకోలేనిదని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కూకట్పల్లి పీఎన్ఎం పాఠశాలలో భారత్ వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం సైనిక్వందన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారి దత్తాత్రేయ, ట్రస్ట్ చైర్మన్ అశ్వినీ సుబ్బారావు, వివేకానంద సేవా సమితి చైర్మన్ సీహెచ్ హన్మంతరావులు హాజరయ్యారు. దేశానికి సేవలందిస్తూ వీరమరణం పొందిన 50 మంది సైనిక కుటుంబాలకు (ఒక్కొక్కరికీ రూ.25 వేల చొప్పున) రూ.12.5 లక్షల నగదును సహాయంగా అందజేయడంతో పాటు 15 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ దేశ రక్షణలో ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలను ఆదుకోవడం గొప్ప విషయమన్నారు.
గురు రుణం, పితృ రుణం, దేశ రుణం తీర్చుకోలేనిదని, దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనికులందరికీ ప్రజలంతా రుణపడి ఉంటారన్నారు. అలాగే, దివ్యాంగులకు ట్రస్ట్ ద్వారా ఉచితంగా కృత్రిమ అవయవాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ వేదికపై పీఎన్ఎం పాఠశాల విద్యార్థులు వీరసైనిక వందనం, నృత్య ప్రదర్శన, నీలవేణి ఆలపించిన వందేమాతరం గీతాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సైనిక్ వందన్ కార్యక్రమ నిర్వాహకులు ఎంవీ రంగారావు, నరేంద్ర కృష్ణ, పి.సుబ్బారెడ్డి, ప్రభాకర్రెడ్డి, సైనిక్ సంక్షేమ బోర్డు చైర్మన్ కల్నల్ రమేశ్, నాగేశ్వర్రావు, చింత ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.