వారం రోజులుగా హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరంలో నిర్వహించిన 35వ జాతీయ లేజర్ రెగెట్టా చాంపియన్షిప్ సెయిలింగ్ పోటీలు గురువారం ముగిశాయి. ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ (ఈఎంఈఎస్ఏ) ఆధ్వర్యంలో తొలిసారి జాతీయ యాచింగ్ సమాఖ్య(వైఏఐ) గుర్తింపుతో ఆసియా గేమ్స్ (2022)కు సన్నాహకంగా జరుగుతున్న ఈ టోర్నీలో తెలంగాణతోపాటు వివిధ రాష్ర్టాల నుంచి 120మందికి పైగా సెయిలర్లు పాల్గొన్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో నిర్వహించిన ఈ పోటీల్లో గోల్డ్మెడల్ సాధించిన వారికి రూ.10వేలు, సిల్వర్ మెడల్ సాధించిన వారికి రూ.5వేలు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి రూ.2వేల నగదును అదనంగా అందజేశారు.
సెయిలింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ఆయా కేటగిరీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ప్రత్యేక కేటగిరీలో ట్రోఫీలను అందుకున్నారు. అందులో తెలంగాణకు చెందిన వీర వంశం వైష్ణవి మాజ్ ఏఏ బాసిత్ ట్రోఫీతోపాటు ఎస్ఎస్సీ లేజర్ రేడియల్ రోలింగ్ ట్రోఫీ దక్కించుకున్నారు. అదేవిధంగా ముంబాయికి చెందిన మోహిత్ సైనీ కటారీ బౌల్, కెల్లీ ఎస్ రావు ట్రోఫీ, నేషనల్ లేజర్ చాంపియన్ ట్రోఫీలు దక్కించుకున్నారు.
యువతరం అన్ని రంగాల్లో ముందుండాలని, ఎంతో చాక చక్యంతో ఆడే సెయిలింగ్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మన దేశానికి కీర్తి తీసుకురావాలని చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్, వైఏఐ అధ్యక్షుడు అడ్మిరల్ కరంబీర్సింగ్ పేర్కొన్నారు. విజేతలకు ట్రోఫీ, మెడల్స్ బహూకరణ, ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో అన్నింటిని అధిగమించి దేశవ్యాప్తంగా సెయిలింగ్ క్రీడాకారులకు తగిన ఏర్పాట్లు చేసి చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
వాతావరణ పరిస్థితులు, నీటి అలలను గుర్తిస్తూ.. అన్నింటినీ అనుకూలంగా మలుచుకుని సెయిలింగ్ చేయాల్సి ఉంటుందని, ఈ క్రీడలో నైపుణ్యతను ఎవరికి వారు నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లెఫ్ట్నెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణ, ఎల్సీఏఐ ఉపాధ్యక్షుడు జేఎస్ సిద్న, సికింద్రాబాద్ క్లబ్ అధ్యక్షుడు ఆర్.రఘురామ్రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎం.రాహుల్రావు, సెయిలింగ్ వీక్ నిర్వాహక కమిటీ ప్రతినిధులు, కోచ్లు, మెంటర్లు, సెయిలింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు.
సెయిలింగ్ చాంపియన్షిప్ పోటీల్లోని ఆయా కేటగిరీల్లో మెడల్స్ సాధించడమే కాకుండా అరుదైన మూడు ట్రోఫీలు దక్కించుకోగలిగాను. వారం రోజులపాటు ఇక్కడే ఉండి సెయిలింగ్ పోటీల్లో పాల్గొన్నా. ఎంతో ప్రశాంతంగా ఉండే హుస్సేన్ సాగర్ తీరంలో పోటీల్లో పాల్గొనడం నేను మరచిపోలేను. హైదరాబాద్ నాకెంతో నేర్పింది. – మోహిత్ సైనీ, సెయిలింగ్ క్రీడాకారుడు, ముంబాయి.
హైదరాబాద్లో 35వ జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కడమే కాకుండా గోల్డ్ మెడల్స్తోపాటు అరుదైన రెండు ట్రోఫీలను సైతం దక్కించుకోగలగడం ఆనందంగా ఉంది. మరింత శ్రమించి భవిష్యత్లో ఒలింపిక్స్లో పాల్గొనాలన్నదే నాలక్ష్యం. ఈ పోటీల్లో విజేతగా నిలవడమే కాకుండా దీని స్ఫూర్తితో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటా. – వీర వంశం వైష్ణవి, సెయిలింగ్ క్రీడాకారిణి, తెలంగాణ.
ఈ పోటీల్లో బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నా. అయినప్పటికీ ఇందులో పాల్గొనడం వల్ల నేనెంతో నేర్చుకోగలిగాను. ఇతర రాష్ర్టాలకు చెందిన క్రీడాకారుల నైపుణ్యాన్ని పరిశీలించే అవకాశం కలిగింది. ఈ పోటీలో పాల్గొనే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. నేవీలో చేరాలన్నది నా లక్ష్యం. దానికి అనుగుణంగా కృషి చేస్తా. – ఝాన్సీ, సెయిలింగ్ క్రీడాకారిణి, తెలంగాణ.