సిటీబ్యూరో/శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): అతి వేగంతో వాహనం నడుపుతూ శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం సాయధరమ్తేజ్ అపోలో వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సినీ నటుడు సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి 7.45 నిమిషాల నుంచి బంజారాహిల్స్ నుంచి తన ట్రంప్ స్పోర్ట్స్ బైక్ (765 సీసీ) మీద బయలుదేరాడు. రాత్రి 7.59 నిమిషాలకు కేబుల్ బ్రిడ్జి ఎక్కాడు. అక్కడి నుంచి యాక్సిడెంట్ చోటుచేసుకున్న స్పాట్కు రా.8.14 గంటలకు (మొత్తం 74 సెకన్లు) చేరుకుని స్కిడ్ అయ్యాడు.
అంటే కేబుల్ బ్రిడ్జి మీద నుంచి యాక్సిడెంట్ జరిగిన స్పాట్కు 75 కిలో మీటర్ల వేగంతో సాయి ధరమ్ తేజ్ చేరుకున్నాడని సైబరాబాద్ పోలీసులు నిర్ధారించారు. అతివేగంగా వచ్చిన సాయిధరమ్ తన బైక్ రోడ్డుపై ఉన్న మట్టిపైకి ఎక్కగానే జారీ పడిపోయాడు. కన్ను, ఛాతి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. హెల్మెట్ ఉండటంతో తలకు ఎలాంటి గాయం కాలేదు. ఈ ఘటనను చూసిన ఓ వాహనదారుడు 108కు ఫోన్ చేసి ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చాడు. వెంటనే 108 సిబ్బంది అక్కడికి చేరుకొని సాయిధరమ్ తేజ్ను స్థానికంగా ఉన్న ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం అపోలోకు తీసుకు వెళ్లారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసు స్టేషన్ రోడ్డు సేఫ్టీ కో-ఆర్డినేటర్ పోలీసు కానిస్టేబుల్ గోవింద్ ఇచ్చిన ఫిర్యాదుపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.స్పోర్ట్స్ బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాయిధరమ్తేజ్కు డ్రైవింగ్ లైసెన్స్ ఉందని దర్యాప్తులో తేల్చారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. అతని కాలర్ బోన్ విరగడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
అంతేకాకుండా ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమి లేదని వైద్యులు స్పష్టం చేశారు. అయితే సాయిధరమ్తేజ్ ఈ మార్గంగా ఏటు వైపు వెళ్తున్నాడో ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. అతను పూర్తిగా ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత ప్రమాదానికి సంబంధించిన అంశంపై ప్రశ్నిస్తామని పోలీసులు చెప్పారు.
సాయిధరమ్ తేజ్ బంజారాహిల్స్, రోడ్డునం. 45, కేబుల్ బ్రిడ్జి, ఇనార్బిట్ రోడ్డు నుంచి ఐకియా షోరూమ్ జంక్షన్ వైపు వెళ్తుండగా మధ్యలోని ఇమేజ్ టవర్స్ దగ్గర ఓ బహుళ అంతస్తు భవనం నిర్మాణం దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ భవన నిర్మాణ సామగ్రిని లారీల్లో తీసుకు వెళ్తుండగా అక్కడ ఇసుక పడి పేరుకుపోయింది. ఇది గమనించకుండా స్పోర్ట్స్ బైక్ పై వేగంగా ప్రయాణించడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు, వాహనదారులు అంచనా వేస్తున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబరు 11(నమస్తే తెలంగాణ): సినీ నటుడు సాయిధరమ్తేజ్ రోడ్డు ఘటనపై సైబరాబాద్ పోలీసులు సుదీర్ఘ దర్యాప్తును చేపట్టారు. ఇందులో ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం..