సిద్ధాంతులు, పండితులు, పూజారుల సూచన మేరకు బుధవారం పలుచోట్ల సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించగా, గురువారం కూడా నగరంలో ఆయాచోట్ల నేత్రపర్వంగా పూల జాతర సాగింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఆడపడుచులు ప్రధాన కూడళ్లల్లో ఉంచి గౌరమ్మకు పూజలు చేసి ఆడిపాడారు. శ్రీరామ చంద్రుడు ఉయ్యాలో.. అయోధ్య పట్నానా ఉయ్యాలో.., గౌరమ్మ నిను కొలుతు ఉయ్యాలో.. ఘనమైన పూజలే ఉయ్యాలో.., ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ.. అంటూ ఆకట్టుకునేలా లయబద్ధంగా పాటలు పాడుతూ చప్పట్లతో పాటు పలుచోట్ల కోలాటం ఆడారు. చిన్నాపెద్ద పటాకులు కాల్చి సంతోషంగా గడిపారు. అనంతరం సమీపంలోని కుంటలు, చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి, వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.