కొవిడ్.. ఆ పేరు వింటేనే జనం జంకుతున్నారు. ఇక పాజిటివ్ వచ్చిందంటే సొంత వారు కూడా దగ్గరకు వెళ్లడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆశ వర్కర్లు ఆత్మీయ సేవలందిస్తూ..ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా నిర్ధారణ జరిగి హోం ఐసొలేషన్లో ఉన్న బాధితులకు వైద్యుల సూచనల మేరకు మెడికల్ కిట్లను అందిస్తున్నారు. ముఖ్యంగా నిండు గర్భిణులకు వైరస్ సోకితే ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. అలాంటి వారికి ఓ ఆశ వర్కర్ ఆశాదీపమైంది. నేరుగా గర్భిణుల ఇంటికి వెళ్లి సపర్యలు చేయడమే కాదు.. పురిటి నొప్పులు వస్తే ఆస్పత్రులకు తీసుకెళ్లి దగ్గరుండి ప్రసవాలు చేయిస్తూ.. ఆపత్కాలంలో ఆత్మ బంధువుగా నిలుస్తున్నది కూకట్పల్లి బస్తీ దవాఖాన ఆశ వర్కర్ సబియా.
బస్తీ దవాఖాన పరిధిలోని శ్రీశ్రీనగర్, ఇందిరానగర్, ఎన్టీఆర్నగర్, రాజీవ్గాంధీనగర్, ప్రశాంత్నగర్ ప్రాంతాల్లో గడపగడపకు తిరుగుతూ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది సబియా. అంతేకాదు గర్భిణులకు అర్ధరాత్రి నొప్పులు వస్తే 102, 108 వాహనాల్లో స్థానిక పీహెచ్సీలో.. అక్కడ కుదరకపోతే గాంధీకి స్వయంగా తీసుకెళ్తుంది. ప్రతినెల పీహెచ్సీల్లో సుమారు ఐదు ప్రసవాలు, హైరిస్క్ ఉన్న వాళ్లను గాంధీ, నిలోఫర్, ఉస్మానియా వంటి దవాఖానల్లో ఇప్పటి వరకు సుమారు 106 ప్రసవాలను సబియానే చేయించింది. ప్రస్తుతం ఆమె పరిధిలో సుమారు ఎనిమిది పాజిటివ్ కేసులుండగా, వారికి తగిన వైద్యసాయం అందించడంతో పాటు కొవిడ్ వచ్చిన ఇద్దరు గర్భిణులకు దగ్గరుండి ప్రసవ సేవలను అందించిన సబియా.. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నది. జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి ప్రతిరోజూ ప్రతి ఇంటి వద్ద శానిటైజేషన్ చేయించడంతో పాటు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది.
పండుగ కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించా. రంజాన్ రోజు సైతం కరోనా బాధితుల బాగోగులను తెలుసుకుంటూ.. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించా. ఇటీవల ఓ గర్భిణికి పాజిటివ్ వస్తే గాంధీకి తీసుకెళ్లి డెలివరీ చేయించా. ప్రస్తుతం మరో గర్భిణికి కొవిడ్ సోకింది. ఆమెకు ధైర్యం చెప్పడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నా. 20న ఆమెకు డెలివరీ టైం ఇచ్చారు. గాంధీలో ప్రసవం చేయిస్తా. -సబియా, ఆశ కార్యకర్త