బడంగ్పేట,మే7: కొవిడ్ నియంత్రణ కోసం స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు ముందుకు రావాలని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపల్ పరిధిలోని వాదేహుదాలో జమాతే ఇస్లామీ హిందు ఆధ్వర్యంలో కొవిడ్ ఆక్సిజన్ థెరఫీ సెంటర్ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ అధ్యక్షుడు మౌలానా హమీద్ మహ్మద్ ఖాన్ ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ నాగేందర్, అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కబీర్ సిద్దిఖీ, ఎస్ఐవో తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ తల్హా ఫయూజుద్దీన్ కలిసి కొవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ సెంటర్ను ఏర్పాటు చేసిన సందర్భంగా మంత్రి వారిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా హమీద్ సాదీ, జమాతే ఇస్లామి నాయకులు అతీఫ్ ఇస్మాయిల్, ముహమ్మద్ అజారుద్దీన్, యూసూఫ్ అలీ ఖాన్, ఖాలిద్, వజీర్ మీర్జా, అజమ్ అలీబేగం తదితరులు పాల్గొన్నారు.