సిటీబ్యూరో, జూన్ 3(నమస్తే తెలంగాణ) : భార్య వదిలేసి వెళ్లిందని మహిళల మీద కోపం పెంచుకుని 18 ఏండ్లలో 17మంది మహిళలను హత్య చేసిన మైనం రాములుపై గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ విధించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన మైనం రాములు బండలను పగులగొట్టే రోజు వారి కూలీ. అతడికి 2003లో వివాహం కాగా కొన్నినెలలకే భార్య వదిలేసి వెళ్లిపోయింది. దీంతో మహిళలపై కోపం పెంచుకున్న రాములు మద్యం షాపులు, కల్లు కంపౌండ్ల వద్ద ఒంటరిగా మద్యం సేవించడానికి వచ్చే మహిళలను టార్గెట్ చేశాడు. వారికి డబ్బులు ఆశచూపి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. అనంతరం హత్యచేసి పోలీసులకు చిక్కకుండా తిరిగేవాడు. ఇలా ఘట్కేసర్ పరిధిలో ఓ మహిళను నిర్మానుష్య ప్రాంతంలో హత్య చేశాడు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు సీసీ కెమెరాల ద్వారా జనవరిలో రాములును అరెస్టు చేశారు. దర్యాప్తులో అతను మొత్తం 17మందిని హత్య చేసినట్లు తేలింది.