మెహిదీపట్నం మే 22 :కొవిడ్ సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వ దవాఖానలకు స్ట్రెచర్లను అందించడానికి రోటరీ క్లబ్ జిల్లా 3150 ముందుకు వచ్చింది. ఈ క్రమంలో శనివారం షేక్పేటలోని నారాయణమ్మ కాలేజ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీ, ఉస్మానియా దవాఖానలతో పాటు మరో 10 జిల్లా ఆస్పత్రులకు సుమారు రూ.25 లక్షల విలువ చేసే 200 స్ట్రెచర్ బెడ్లను అందజేశారు. 3150 జిల్లా గవర్నర్ హన్మంత్రెడ్డి మాట్లాడుతూ.. కొవిడ్ సహాయక చర్యల్లో భాగంగా స్ట్రెచర్లను అందించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరాలను తీర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 14 రోటరీ క్లబ్బులు, 2 రోటరాక్ట్ క్లబ్బులు, రోటరీ 3150 జిల్లాలోని స్నేహితులు అందరూ ముందుకు వచ్చి.. ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులతో పాటు నిజామాబాద్, సంగారెడ్డి, బోధన్, జగిత్యాల, ఆర్మూర్, బాన్సువాడ, తాండూర్, వరంగల్, కామారెడ్డి, కరీంనగర్లోని 10 ఆసుపత్రులకు ఈ స్ట్రెచర్ బెడ్లు అందిస్తున్నామని తెలిపారు.